ఈ ప్రాంతంలో 1990ల వరకూ 10వ తరగతికి మించి చదివినవారు దాదాపు ఎవరూ ఉండేవారు కాదు. కొత్త తరం నెమ్మదిగా ఒక వ్యవస్థీకృత విద్యను అభ్యసించడం ప్రారంభించింది. 1వ తరగతిలో 25 మంది వర్లీ విద్యార్థులు చేరితే, వారిలో కేవలం ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే 10వ తరగతికి చేరుకున్నారు. బడి మానేసినవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆ ఎనిమిది మందిలో కూడా 5-6 మంది మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 12వ తరగతికి చేరుకునే సరికి ఇంకా ఎక్కువమంది విద్యార్థులు చదువు మానేయటంతో చివరకు 3-4 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాల చదువును ముగించగలిగారు.
కళాశాల చదువు ఇక్కడికి దాదాపు 10 కిలోమీటర్ల ప్రయాణ దూరంలో, తాలూకా స్థాయిలో సాధ్యమవుతుంది. కానీ ఈ ప్రాంతంలో అంతకుమించిన చదువు ఏమీ లేకపోవటంతో విద్యార్థులు తదుపరి విద్య కోసం ఠానే, నాసిక్ లేదా పాల్ఘర్ వంటి నగర ప్రాంతాలకు వెళతారు. ఫలితంగా, ఈ తాలూకాలో కేవలం మూడు శాతం మంది మాత్రమే కళాశాల చదువును కలిగి ఉన్నారు.
వర్లీ సముదాయంలో విద్యా రేటు ప్రత్యేకించి తక్కువగా ఉంది, దానిని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేం గ్రామాలకు వెళ్ళి, ప్రజలతో వారి స్వంత భాషలోనే సంభాషించడం ద్వారా కూడా వారితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, ఒక నమ్మకాన్ని పెంపొందించేందుకు మరింత కృషి చేస్తున్నాం.
ఈ డాక్యుమెంటేషన్ రూపకల్పనలో సహాయం చేసినందుకు AROEHAN కు చెందిన హేమంత్ శింగడేకు PARI ధన్యవాదాలు తెలియజేస్తోంది.
ఇంటర్వ్యూ: మేధా కాళే
భారతదేశంలో హానికి లోనవుతోన్న, అంతరించిపోతోన్న భాషలను డాక్యుమెంట్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న PARI అంతరించిపోతున్న భాషల ప్రాజెక్ట్లో ఈ కథనం ఒక భాగం.
వర్లీ భారతదేశంలోని గుజరాత్, డామన్ & డయ్యూ, దాద్రా & నాగర్ హవేలీ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలలో నివసిస్తున్న వార్లీ లేదా వర్లీ ఆదివాసీలు మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష. యునెస్కో వారి అట్లాస్ ఆఫ్ లాంగ్వేజెస్, వర్లీని భారతదేశంలో హానికి లోనవుతోన్న భాషలలో ఒకటిగా జాబితా చేసింది.
మహారాష్ట్రలో మాట్లాడే వర్లీ భాషను డాక్యుమెంట్ చేయటం మా లక్ష్యం
అనువాదం: సుధామయి సత్తెనపల్లి