"ఎథే రోటీ కట్ మిల్దీ హై, చిట్టా సరే ఆమ్ మిల్దా హై [ఇక్కడ ఆహారానికి కొరత కానీ, హెరాయిన్కి మాత్రం కొదవ లేదు]."
హర్వంశ్ కౌర్ ఒక్కగానొక్క కొడుకు మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. "మేం అతనిని ఆపడానికి ప్రయత్నిస్తాం. అయినా అతను మాతో పోట్లాడి, డబ్బు మొత్తం తీసుకుపోయి మాదకద్రవ్యాల మీద ఖర్చు చేస్తాడు," అని నిస్సహాయురాలైన ఆ తల్లి తెలిపారు. ఇటీవలే ఆమె కొడుకు (25) తండ్రి కూడా అయ్యాడు. తమ గ్రామంలో చిట్టా (హెరాయిన్) ఇంజెక్షన్లు, క్యాప్సూల్స్ రూపంలోని సైకోట్రోపిక్ పదార్థాలు సులభంగా లభిస్తాయని ఆమె చెప్పారు.
“ప్రభుత్వం తల్చుకుంటే, ఈ మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపగలదు. లేకుంటే, మా పిల్లలు చాలా మంది చనిపోతారు." హర్వంశ్ కౌర్ రావుకే కలాఁ గ్రామంలోని ఒక బంగాళదుంపలను నిల్వచేసే యూనిట్లో పనిచేసే రోజువారీ కూలీ. ఆమె ప్యాక్ చేసే ప్రతి సంచికి రూ. 15 లభిస్తుంది. ఆమె రోజుకు దాదాపు 12 సంచులు ప్యాక్ చేసి, సుమారు రూ. 180 సంపాదిస్తారు. ఆమె భర్త, 45 ఏళ్ళ సుఖ్దేవ్ సింగ్, వాళ్ళ గ్రామమైన నంగల్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నిహాల్ సింగ్ వాలాలోని ఒక గిడ్డంగిలో రోజువారీ కూలీగా పనిచేస్తారు. గోధుమలు లేదా బియ్యం బస్తాలను ప్యాక్ చేసే పని దొరికినప్పుడు ఆయన రోజుకు రూ. 300 సంపాదిస్తారు. వాళ్ళిద్దరి సంపాదనపైనే కుటుంబమంతా ఆధారపడింది..
అసలు విషయానికి వస్తే, పంజాబ్లోని మోగా జిల్లాలోని ఈ గ్రామంలో ఆమె పొరుగున ఉండే కిరణ్ కౌర్, "మా గ్రామం నుంచి మాదకద్రవ్యాలను నిర్మూలిస్తామని వాగ్దానం చేసేవాళ్ళకే మా ఓటు వేస్తాం," అని చెప్పింది.
ఆమె భర్త కూడా మాదకద్రవ్యాలకు అలవాటు పడినందువల్లే కిరణ్ ఈ మాటలను అనగలిగింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన కిరణ్కు మూడేళ్ళ కుమార్తె, ఆరు నెలల కొడుకు ఉన్నారు. “ఒక మామూలు కూలీ అయిన నా భర్త గత మూడేళ్ళుగా మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. సంపాదించినదంతా మాదకద్రవ్యాలకే ఖర్చు పెడతాడు." అని కిరణ్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఎనిమిది మంది సభ్యులు నివాసముండే తమ ఇంటి గోడలకు ఉన్న పెద్ద పెద్ద పగుళ్ళను చూస్తూ, “గదులు బాగుచేయించడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?” అంటుందామె.









