దాదాపు ప్రతి భారతీయ రైతుకు తెలిసిన కొద్దిపాటి ఆంగ్ల పదాలలో 'స్వామినాథన్ రిపోర్ట్', 'స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్' అనేవి ఉంటాయి. ఆ నివేదిక ప్రధానంగా చేసిన సిఫారసు ఏమిటో కూడా వారికి తెలుసు: కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పి) = సమగ్ర ఉత్పత్తి ధర + 50 శాతం (C2 + 50 శాతం అని కూడా అంటారు).
ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ కేవలం ప్రభుత్వం, అధికార యంత్రాంగం, లేదా సైన్స్ సంస్థల్లోనే కాకుండా - రైతుల కోసం జాతీయ కమిషన్ (ఎన్సిఎఫ్) నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న లక్షలాది మంది రైతుల హృదయాల్లో కూడా ప్రధానంగా నిలిచివుంటారు.
ఈ నివేదిక పేరేదైనా, భారతీయ రైతులైతే దీనిని 'స్వామినాథన్ నివేదిక' అనే పిలుస్తారు. ఎందుకంటే ఆయన అధ్యక్షత వహించిన ఎన్సిఎఫ్ నివేదికలకు ఆయన ఇచ్చిన భారీ సహకారం, వాటిపై ఆయన వేసిన ప్రభావం ఎన్నటికీ చెరిగిపోనిది.
ఈ నివేదికల కథ చూస్తే యుపిఎ, ఎన్డిఎ ప్రభుత్వాలు రెండూ వీటికి ద్రోహం చేసినవీ, వీటిని అణచిపెట్టినవే. ఈ నివేదికలలో మొదటిది 2004 డిసెంబర్లోనూ, ఐదవదీ చివరిదీ 2006 అక్టోబర్ ప్రాంతాల్లోనూ వచ్చాయి. మనకు ఎంతో అవసరమైన వ్యవసాయక సంక్షోభం గురించిన చర్చ కోసం పార్లమెంటులో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడాన్ని అటుంచి, కనీసం ఒక గంటపాటు దీనిగురించి శ్రద్ధగా చర్చించినది కూడా ఎన్నడూ జరగలేదు. మొదటి నివేదికను సమర్పించి ఇప్పటికి 19 సంవత్సరాలయింది.
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్వామినాథన్ నివేదికను, ముఖ్యంగా దాని కనీస మద్దతు ధర ఫార్ములా సిఫారసును త్వరితగతిన అమలు చేస్తామని వారు చేసిన వాగ్దానం కూడా వారు అధికారంలోకి రావడానికి కొంతమేరకు తోడ్పడింది. అయితే ఆ వాగ్దానాన్ని అమలుచేయడానికి బదులుగా, అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం ఇది మార్కెట్ ధరలను వక్రీకరిస్తుంది కాబట్టి దీనిని అమలుచేయటం సాధ్యం కాదని పేర్కొంటూ త్వరత్వరగా సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది.
ఈ నివేదికలు చాలా ‘రైతు అనుకూలమైనవి’ అని ఈ ప్రభుత్వాలు వాదిస్తుండటానికి, ఈ రెండు కూటముల (యుపిఎ, ఎన్డిఎ) ప్రభుత్వాలు భారతీయ వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి అప్పగించడానికి ప్రయత్నిస్తుండటమే కారణం కావచ్చు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయానికి సంబంధించి ఒక సానుకూలమైన బ్లూప్రింట్(వివరణాత్మక పథకం)ను ఈ నివేదిక అందించింది. మనం వ్యవసాయ రంగంలో అభివృద్ధిని రైతుల ఆదాయవృద్ధి పరంగా కొలవాలి తప్ప, కేవలం పెరిగిన ఉత్పత్తితో కాదు అని నమ్మి, ఈ కమిషన్కు భిన్నమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించాలనుకున్న వ్యక్తి అధ్యక్షుడు కావటం వలన.






