"నా కుటుంబం మాత్రమే నన్ను ఒప్పుకోవడానికి సందేహించింది, జాలరులు కాదు. పడవల యజమానులు నన్ను కైరాసిగా [అదృష్టం తెచ్చేవారు] చూస్తారు," అంటారు మనీషా. "వాళ్ళు నన్ను తిరస్కరించలేదు. నేనెవరినో వారు పట్టించుకోరు. వాళ్ళ చేపలను అమ్మిపెట్టడమే వారికి కావలసింది," చేపల వేలంపాటదారైన ఈ ట్రాన్స్ మహిళ సంతోషంగా చెప్పారు.
కడలూరు పాత పట్నం ఓడరేవులో పనిచేస్తోన్న 30 మంది మహిళా వేలంపాటదారులలో 37 ఏళ్ళ మనీషా కూడా ఒకరు. “నేను బిగ్గరగా పిలవగలను కాబట్టి నేను ఎక్కువ ధరను పొందగలను. చాలా మంది నా నుండి చేపలు కొనాలనుకుంటారు,” కొనుగోలుదారులను పిలుస్తున్నప్పుడు ఇతర అమ్మకందారుల కంటే బిగ్గరగా వినిపిస్తోన్న స్వరంతో అన్నారామె.
లింగ స్థిరీకరణ శస్త్రచికిత్స చేయించుకోవాడానికి చాలా కాలం ముందునుంచే మనీషా చేపల వేలంపాటదారుగానూ ఎండు చేపల వ్యాపారిగానూ ఉన్నారు. ఈ జీవనోపాధి వలన ఆమె ప్రతిరోజూ పడవ యజమానులతోనూ, జాలరులతోనూ వ్యవహరించవలసివస్తుంది. "వారికి ఎలాంటి సమస్య లేదు. ఇతరులకంటే నేను చేపలను చాలా బాగా వేలం వేస్తాను."
పడవ యజమానుల నైతిక మద్దతు లేనట్లయితే తనకు 2012లో శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉండేదికాదని ఆమె అన్నారు. వారిలో ఆమె సన్నిహిత స్నేహితుడు, ఆంతరంగికుడు కూడా ఉన్నారు. శస్త్రచికిత్స ప్రక్రియ ముగిసిన వెంటనే ఆమె అతనిని స్థానిక గుడిలో పెళ్ళి చేసుకున్నారు.
















