"ఇప్పుడు నాన్నగారు నా పక్కన ఉంటే ఎంతో బాగుండేది," అని ప్రియాంక మొండల్ అన్నారు, తన తండ్రి జ్ఞాపకాలు గుర్తొచ్చి బాధపడుతూ. ఆమె ఎరుపు బంగారం రంగులు కలిసి ఉన్న దుస్తుల్లో తన ఒడిలో పూలతో ఆమె పింక్ మరియు నీలం రంగుల పల్లకీలో కూర్చుని ఉన్నారు. ఆ పల్లకీలో రజత్ జుబిలీ గ్రామంలోని తన భర్త ఇంటికి వెళ్తారు.
పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పర్గనాస్ జిల్లాలోని ఈ గ్రామానికి చెందిన ప్రియాంక (23) హిరణ్మయ్ మొండల్ (27) ను 7 డిసెంబర్ 2020 నాడు పెళ్లి చేసుకోనున్నారు. హిరణ్మయ్ వారి పక్క ఇంట్లో ఉండే వారు, కోల్కతాలోని ఒక రిటెయిల్ బట్టల దుకాణంలో ఫ్లోర్ ఎగ్జిక్యూటివ్గా పని చేసేవారు. ప్రేమలో ఉన్న ఈ జంట 2019లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
"అయితే, 2019 జులై 29న చిరుతపులి దాడిలో ప్రియాంక తండ్రి అర్జున్ మొండల్ (45) మృతి చెందడంతో, సుందర్బన్లలోని లాహిరిపూర్ గ్రామ పంచాయితీలో జరగాల్సిన వారి వివాహం వాయిదా పడింది. మత్స్యకారుడైన అర్జున్, సుందర్బన్ టైగర్ రిజర్వ్లోని పిర్ఖలీ గాజీ అరణ్య ప్రాంతంలో పీతలను సేకరించేందుకు ఎప్పటి లాగానే వెళ్లారు. అయితే, అతని శరీర అవశేషాలు కూడా దొరకలేదు.
"పీతలను సేకరించేందుకు అడవుల్లోకి అర్జున్ వెళ్లిన ప్రతి సారి, అతను సురక్షితంగా తిరిగి వస్తారో లేదో అని అతని కుటుంబ సభ్యులు కలత చెందేవారు. 2019 జులైలో తాను చివరిసారి బయలుదేరి వెళ్లినప్పుడు తన కూతురి వివాహం గురించే ఆయన ఆలోచిస్తూ ఉన్నారు.
“ప్రియాంక వివాహం కోసం మాకు డబ్బు అవసరం ఉండింది. అందువల్ల తప్పనిసరై తను అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది, అయితే ఏదో చెడు జరగబోతోందని తనకు అనిపించింది,” అని ఆయన భార్య పుష్ప చెప్పారు."

























