ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని కోటపాలెం గ్రామంలో బంటు దుర్గారావుకు చెందిన కొబ్బరితోట త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని కోటపాలెం, కొవ్వాడ, మరువాడ (మరియు అందులోని రెండు శివారు గ్రామాలు - గూడెం మరియు తెక్కలి)లను కలుపుకుని మొత్తం 2,073 ఎకరాలలో అతని సొంతానికి ఒక ఎకరం భూమి ఉంది. ఈ భూమి మొత్తాన్ని, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) కర్మాగారం కోసం జిల్లా యంత్రాంగం సేకరిస్తోంది.
కానీ 2017 మే నెలలో, దుర్గారావుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ్ వికాస్ బ్యాంక్ నుండి రూ. 60,000 రుణం మంజూరు అయ్యింది. "ఒకవైపు బ్యాంకులు వ్యవసాయ రుణాలను మంజూరు చేస్తున్నాయి, మరో వైపు రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ 33లో [అతని భూమి ఉన్న చోట] నీటి వాగు ఉందని అంటున్నారు. రెండూ ప్రభుత్వ సంస్థలే అయినప్పుడు, రెండూ ఎలా నిజం అవుతాయి?" అని ఆయన సందేహం వ్యక్తం చేశాడు.
విద్యుత్తు కర్మాగారం వల్ల దాదాపు 2,200 రైతు మరియు మత్స్యకారుల కుటుంబాలు నిర్వాసితులు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్కు చెందిన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2017లో ప్రచురించిన సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ పేర్కొంది. ఈ కుటుంబాలలో అధిక శాతం OBC మరియు దళిత సామాజిక వర్గాలకు చెందినవి. ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి రూ. 4 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని రిపోర్ట్ అంచనా వేసింది.
ఆ మూడు గ్రామాలతో పాటు రణస్థలానికి చెందిన రెండు శివారు గ్రామాలలోని భూమిని సేకరించే ప్రక్రియ 2011లో మొదలై, 2014 ఎన్నికల తర్వాత ఊపందుకుంది. అయితే, 2018 మార్చిలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం నుండి వైదొలిగింది. NPCIL ఒక కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కాబట్టి, "ఈ ప్రాజెక్ట్ మరింతగా ఆలస్యం అవుతుంది" అని కోటపాలెం గ్రామ సర్పంచ్ సుంకర ధనుంజయరావ్ చెప్పారు.
దీని వల్ల గ్రామవాసులలో అనిశ్చితి, గందరగోళం మరింత ఎక్కువయ్యాయి.








