శివపూజన్ పాండేకి వేరే ట్యాక్సీడ్రైవర్ నుండి ఫోన్ వచ్చిన వెంటనే తత్కాల్ లో టిక్కెట్ కొని, జూలై 4న ఉత్తర్ ప్రదేశ్లోని మీర్జాపూర్ స్టేషన్లో రైలు ఎక్కారు.
మరుసటి రోజు ముంబై చేరుకొని, ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నప్పటికీ, 63 ఏళ్ల శివపూజన్ తన ట్యాక్సీని కాపాడుకోలేకపోయారు.
కొరోనా లాక్డౌన్ల కారణంగా, నగరంలోని విమానాశ్రయంలో చాలా నెలలుగా పట్టించుకోకుండా పడి ఉన్న 42 క్యాబ్లను ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వేలం వేసింది. వాటిలో శివపూజన్ ట్యాక్సీ కూడా ఉంది.
అలా అతను తన జీవనోపాధిని కోల్పోయారు. శివపూజన్ 1987 నుండి ట్యాక్సీని నడుపుతున్నారు; 2009లో తన సొంత నలుపు-పసుపు మారుతీ ఓమ్నీని ఋణం తీసుకొని మరీ కొనుగోలు చేశారు.
“ఇలా వేలం వేసి వాళ్ళేం సాధించారు? నేను నా జీవితమంతా క్యాబ్ డ్రైవర్ గానే పని చేశాను. ఇప్పుడు వాళ్ళు అది కూడా లేకుండా చేశారు. ఇలాంటి సమయంలో ఇంత నష్టాన్ని మేం ఎలా తట్టుకోగలం?” అని ఒక రోజు మధ్యాహ్నం సహార్ విమానాశ్రయం దగ్గర ఫుట్పాత్ మీద నిలబడి అతను కోపంగా ప్రశ్నించారు.
ఇటీవల, సంజయ్ మాలి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. మార్చ్ 2020 నుండి, ఉత్తర ముంబై మరోల్ ప్రాంతం అన్నావాడిలోని ఒక ఖాళీ స్థలంలో అతని వ్యాగన్-ఆర్ 'కూల్ క్యాబ్' పార్క్ చేసి ఉంది. ఇది సహార్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ఉంది
2021, జూన్ 29 రాత్రివేళ అతని క్యాబ్ను ఆ పార్కింగ్ స్థలం నుండి తరలించారు. మరుసటి రోజు, ఒక స్నేహితుడి నుండి ఈ సమాచారం తెలుసుకున్న 42 ఏళ్ల సంజయ్, “అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు,” అని నిర్ఘాంతపోయారు.














