అసలు ప్రశ్న విలువలకు సంబంధించినది. ఈ విలువలనేవి మన జీవితంలో ఒక భాగం. మనల్ని మనం ప్రకృతిలో ఒకరంగా చూసుకుంటాం. ఆదివాసీలు పోరాటం చేసేటప్పుడు ప్రభుత్వం మీదనో, కార్పొరేషన్ మీదనో పోరాడరు. వారికి వారి సొంత 'భూమి సేన' ఉంది. స్వార్థం, దురాశలలో వేర్లు లోతుగా పాతుకుపోయిన విలువలకు వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తారు.
ఇదంతా నాగరికతల పెరుగుదలతో ఆరంభమైంది. వ్యక్తివాదం పెరిగిపోవడాన్ని చూడటం మొదలైనప్పుడే, మానవుడిని ప్రకృతిలోని ఒక ప్రత్యేక అస్తిత్వంగా మనం చూడటం ప్రారంభించాం. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. నది నుండి మనల్ని మనం ఎప్పుడైతే వేరుచేసుకుంటామో, అప్పుడు మనం మన మురుగునీటి వ్యర్థాలను, మన రసాయన, పారిశ్రామిక వ్యర్థాలను ఆ నదినీటిలోకి వదిలేయడానికి ఎంతమాత్రం వెనుకాడం. మనం నదిని ఒక వనరుగా మన స్వాధీనంలోకి తీసుకోవటం ప్రారంభమవుతుంది. ఒకసారి మనల్ని మనం ప్రకృతికి భిన్నమైనవారిగా, ఉన్నతమైనవారిగా భావించడం మొదలవగానే, ప్రకృతిని దోచుకోవడం, దోపిడీ చేయడం మరింత సులభమవుతుంది. మరోవైపు, ఆదివాసీ సమాజ విలువలు కేవలం కాగితంపై రాసిపెట్టిన విలువలు కాదు. మన విలువలే మన జీవన విధానం.


