ప్రియమైన భారత ప్రధాన న్యాయమూర్తిగారికి,
మీడియా పోకడ పై మీ నిశిత పరిశీలనకు ధన్యవాదాలు, “దురదృష్టవశాత్తూ పరిశోధనాత్మక పాత్రికేయం అనే కాన్సెప్ట్, మీడియా కాన్వాస్ నుండి కనుమరుగవుతోంది. మేము ఎదుగుతున్నప్పుడు, పెద్ద కుంభకోణాలను బయటపెట్టే వార్తాపత్రికల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారము. వార్తాపత్రికలు మమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచలేదు.”
ఇటీవలి కాలంలో మీడియా గురించి, చాలా అరుదుగా నిజమైన మాటలు మాట్లాడుతున్నారు. క్లుప్తంగా, మీ పాత సోదరభావాన్ని గుర్తుచేసుకున్నందుకు ధన్యవాదాలు. మీరు 1979లో ఈనాడులో చేరిన కొద్ది నెలలకే నేను జర్నలిజంలోకి వెళ్లాను.
మీరు ఇటీవల ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మీ ప్రసంగంలో గుర్తుచేసుకున్నట్లుగా - ఆ విపరీతమైన రోజుల్లో, మేము నిద్రలేచి, "పెద్ద కుంభకోణాలను బహిర్గతం చేసే వార్తాపత్రికల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారము." ఈ రోజు మనం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) వంటి క్రూరమైన చట్టాల ప్రకారం ఆ కుంభకోణాలను బయటపెట్టిన జర్నలిస్టులు, వారి నివేదికల వలన జైలుకు పంపబడ్డారన్న వార్తలతో మేలుకుంటున్నాము సార్. లేదా భయంకరంగా దుర్వినియోగం అవుతున్న, మీరు ఇటీవల తీవ్రంగా విమర్శించిన, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) వంటి చట్టాల క్రింద వారి జీవితం ఇబ్బందులలో పడుతోంది.
"గతంలో కుంభకోణాలు, దుష్ప్రవర్తన పై వార్తాపత్రిక ప్రచురించిన నివేదికలు తీవ్రమైన పరిణామాలకు దారితీసే తరంగాలను సృష్టించడం మేము చూశాము" అని ఆ ప్రసంగంలో అన్నారు మీరు. అయ్యో, ఈ రోజుల్లో జర్నలిస్టులు ఇలాంటి కథనాలు చేయడం పై తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది పరిశోధనాత్మక జర్నలిజానికే కాదు, స్ట్రెయిట్ రిపోర్టింగ్ చేసే వారికి కూడా, ఈ ప్రమాదం ఉంటోంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఆ భయంకరమైన దారుణంలో, సామూహిక లైంగిక హింసకు గురైన బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి హత్రాస్కు వెళుతుండగా అరెస్టు అయిన సిద్ధిక్ కప్పన్, బెయిల్ పొందలేక ఒక సంవత్సరం పాటుగా జైలులో మగ్గుతున్నాడు. అతని కేసు ఒక కోర్ట్ నుండి ఇంకో కోర్టుకు బంతిలా విసరబడుతూండగా, జైలులో అతని ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణీస్తోంది.
మన ముందు ఉన్న ఈ ఉదాహరణతో, ఖచ్చితంగా, జర్నలిజం చాలావరకు - అది పరిశోధనాత్మకమైనదైనా లేదా మరేదైనా - అదృశ్యమైపోతోంది.
జస్టిస్ రమణ గారు, గతంలో జరిగిన కుంభకోణాలను బహిర్గతం చేసిన కథనాలతో పోలిస్తే, మీరు “ఇటీవలి సంవత్సరాలలో జరిగిన ఇంత పెద్ద కథనాన్ని గుర్తుకు తెచ్చుకోలేదు. తోటలో మీకు అంతా గులాబీలమయంలా కనిపిస్తుంది. ఇక మీ స్వంత నిర్ధారణలకు మీరే రావాలి. ”
చట్టం, మీడియా- ఈ రెండింటిపై మీకున్న లోతైన జ్ఞానంతో పాటుగా, భారతీయ సమాజాన్ని నిశితంగా పరిశీలించే వ్యక్తిగా - మీకు ఈ విషయం చెప్పాలని కోరుకుంటున్నాను. సార్, మీరు కొంచెం ముందుకు వెళ్లి పరిశోధనాత్మకంగానే కాకుండా భారతీయ జర్నలిజాన్ని ముంచెత్తిన చాలా అంశాలను బయటపెట్టారు. మా స్వంత నిర్ధారణలకు రావాలని మీరు మమ్మల్ని ఆహ్వానించినట్లుగా, మీ పరిశీలన కోసం నేను మూడు కారణాలను అందించవచ్చా?
ముందుగా, మీడియా యాజమాన్య నిర్మాణాత్మక వాస్తవాలు అత్యధిక లాభాలను ఆకాంక్షించే కొన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నాయి.
రెండవది, స్వతంత్ర జర్నలిజంపై రాష్ట్రం చేసే ఘనమైన దాడి, అంతేగాక అటువంటి జర్నలిజం పై నిర్దాక్షిణ్యమైన అణచివేత.
మూడవదిగా, కుళ్లిపోతున్న నైతికత - అధికారానికి స్టెనోగ్రాఫర్లుగా పనిచేయడానికి చాలామంది సీనియర్ ప్రొఫెషనల్స్ ఆత్రుతపడుతున్నారు.
నిజానికి, క్రాఫ్ట్ నేర్పించే వ్యక్తిగా, నేను నా విద్యార్థులను మా వృత్తిలో మిగిలి ఉన్న రెండు ఆలోచనా విధానాలలో దేనికి చెందాలనుకుంటున్నారో ఎంచుకోమని అడుగుతాను - జర్నలిజమా లేక స్టెనోగ్రఫీనా?
దాదాపు 30 సంవత్సరాలుగా, భారతీయ మీడియా రాజకీయంగా స్వేచ్ఛగా ఉందని, అయితే లాభం కోసం ఖైదు చేయబడ్డదని నేను వాదించాను. నేడు, వారు లాభార్జనతో ఖైదు చేయబడి ఉండినా, వారిలో కొన్ని స్వతంత్ర స్వరాలు మాత్రం రాజకీయంగా ఖైదు చేయబడ్డాయి.
మీడియా స్వేచ్ఛ ఎంత భయంకరమైన స్థితిలో ఉందో మీడియాలోనే చాలా తక్కువ చర్చలు జరుగుతున్నాయని గమనించడం చాలా ముఖ్యం. జర్నలిజంతో సంబంధం ఉన్న నలుగురు ప్రముఖ ప్రజా మేధావులు గత కొన్నేళ్లలో హత్యకు గురయ్యారు. వీరిలో ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ పూర్తి స్థాయి మీడియా మనిషి. (వాస్తవానికి రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ షుజాత్ బుఖారీ కూడా ముష్కరుల తూటాలకు బలయ్యారు). కానీ మిగిలిన ముగ్గురూ మీడియాలో తరచుగా రాసే రచయితలు, కాలమిస్టులు. నరేంద్ర దభోల్కర్ దాదాపు 25 సంవత్సరాల పాటు మూఢనమ్మకాలపై పోరాడుతూ, ఒక పత్రికను స్థాపించి సంపాదకత్వం వహించారు. గోవింద్ పన్సారే, M.M. కల్బుర్గి కూడా అద్భుత రచనా పటిమ ఉన్న రచయితలు, కాలమిస్టులు.
ఈ నలుగురిలో ఒక లక్షణం కలిసి ఉంది: వారు హేతువాదులు, అలానే వీరు భారతీయ భాషలలో వ్రాసే జర్నలిస్టులు - ఇది వారి హంతకులకు ముప్పును పెంచింది. నలుగురి హత్యలు రాష్ట్రేతర పాత్రధారుల ద్వారా నిర్వహించబడ్డాయి, ఇది స్పష్టంగా రాష్ట్ర స్థాయి రాజకీయాలలో రాష్ట్రేతరులు అవసరాన్ని మించి లీనమవుతున్నారని తెలియజేస్తోంది. వీరి జాబితాలో ఇంకా అనేక ఇతర స్వతంత్ర జర్నలిస్టులు ఉన్నారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో పత్రికా స్వేచ్ఛ అత్యల్ప స్థాయికి చేరుకుందనే వాస్తవాన్ని న్యాయవ్యవస్థ ఎదుర్కొంటే ప్రస్తుత జర్నలిజం ఈ దుర్భర స్థితి నుండి కొంత మెరుగుపడవచ్చు. ఆధునిక సాంకేతిక స్థితిని అణచివేయగల ఈ సామర్థ్యం - మీరు పెగాసస్ కేసుతో వ్యవహరిస్తూ నిస్సందేహంగా గమనించినట్లు - ప్రస్తుత పరిస్థితి ఎమెర్జెన్సీ పీడకలలను కూడా చిన్నదిగా కనపడేలా చేస్తోంది.
ఫ్రాన్స్కు చెందిన రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ 2020లో విడుదల చేసిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత్ 142వ ర్యాంక్కు దిగజారింది.
పత్రికా స్వేచ్ఛ పట్ల ఈ ప్రభుత్వ విధానం గురించి నా ప్రత్యక్ష అనుభవాన్ని పంచుకోనివ్వండి. అవమానకరమైన 142 ర్యాంక్ వచ్చిందన్న కోపంతో, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, ఇండెక్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు, ఇది భారతదేశంలో పత్రికా స్వేచ్ఛపై రికార్డును సృష్టించింది. ఇందులో సభ్యునిగా ఉండమని నన్ను అడిగినప్పుడు, WPFI ర్యాంకింగ్ను తిరస్కరించడం కంటే భారతదేశంలోని పత్రికా స్వేచ్ఛ యొక్క వాస్తవ స్థితిపై ఎక్కువ దృష్టి పెడతామనే హామీతో నేను అంగీకరించాను.
13 మందితో కూడిన ఈ కమిటీలో, 11 మంది బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ-నియంత్రిత-సంస్థ పరిశోధకులు ఉన్నారు. కానీ ఈ పత్రికా స్వేచ్ఛతో వ్యవహరించే కమిటీలో, కేవలం ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు! వారిలో ఒకరు, హాజరైన రెండు సమావేశాలలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సమావేశాలు సజావుగా సాగాయి, అయినప్పటికీ అక్కడ నేను మాత్రమే మాట్లాడుతున్నానని, ప్రశ్నలను లేవనెత్తుతున్నానని గమనించాను. ఆ తర్వాత వర్కింగ్ గ్రూపులచే ‘డ్రాఫ్ట్ రిపోర్ట్’ రూపొందించబడింది, ఇందులో ‘డ్రాఫ్ట్’ అనే పదం లేకపోవడం గమనార్హం. సమావేశాల్లో లేవనెత్తిన తీవ్రమైన అంశాలేవీ నివేదికలో ప్రతిబింబించలేదు. కాబట్టి నేను వాటిని ఆ డ్రాఫ్ట్ లో చేర్చడానికి స్వతంత్ర లేదా భిన్నాభిప్రాయాన్ని సమర్పించాను.
ఒక్కసారిగా ఆ నివేదిక, ఆ కమిటీ, అన్నీ మాయమయ్యాయి. దేశంలోని అత్యున్నత బ్యూరోక్రాట్ ఆదేశాలపై ఏర్పాటైన ఒక కమిటీ - బహుశా, భారతదేశంలోని ఇద్దరు అత్యంత శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే నివేదించే కమిటీ - అదృశ్యమైంది. పత్రికా స్వేచ్ఛపై RTI విచారణలు నివేదికను వెలికితీయడంలో విఫలమయ్యాయి! నా దగ్గర ఆ 'డ్రాఫ్ట్' కాపీ కూడా ఉంది. పరిశోధనాత్మక జర్నలిజం కాదు, భారతదేశంలో పని చేసే జర్నలిజాన్ని పరిశోధించడమే అసలైన కసరత్తు. అందుకున్న ఒక్క అసమ్మతితో అది కూడా అదృశ్యమైంది.
మీ ప్రసంగంలో ప్రస్తావించిన జర్నలిజంలో పరిశోధనాత్మక రిపోర్టింగ్ను చేయడానికి చాలా మందికి ఆసక్తి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలో జరిగే స్కామ్లు, అవినీతిపై దర్యాప్తులు చెయ్యాలని చాలా ఉంది. ఈ రోజు దీన్ని ప్రయత్నిస్తున్న చాలా మంది జర్నలిస్టులు మొదటి అడుగు వద్దనే పెద్ద అడ్డంకిలో పడ్డారు - ప్రయోజనాలకు సంబంధించిన ప్రభుత్వ ఒప్పందాలు, ఉన్నత స్థానాల్లో ఉన్న శక్తివంతమైన వ్యక్తులతో, కార్పొరేట్ మీడియా బాస్లతో మమేకమై ఉంది.
పెయిడ్ న్యూస్ల ద్వారా విపరీతంగా డబ్బు సంపాదిస్తున్న దిగ్గజ మీడియా యాజమాన్యాలు, ప్రభుత్వ వనరుల దోపిడీకి లైసెన్స్లు పొందడం, ప్రభుత్వ ప్రైవేటీకరణ ఆర్మీ వేల కోట్ల ప్రజా ఆస్తులను వారికి అప్పగించడం జరుగుతుంటే, ఇవే యాజమాన్యాలు అధికార పార్టీల ఎన్నికల ప్రచారాలకు విపరీతంగా నిధులు సమకూరుస్తున్నాయి. అధికారంలో ఉన్న వారి భాగస్వాములను కలవరపెట్టడానికి ఈ యాజమాన్యాలు, వారి పాత్రికేయులను అనుమతించే అవకాశం లేదు. దీని వలన ఒకప్పుడు గర్వించదగిన భారతీయ వృత్తి ప్రస్తుతం కేవలం ఆదాయ మార్గంగా తగ్గి, తరచుగా ఫోర్త్ ఎస్టేట్ కు, రియల్ ఎస్టేట్ కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మసకబారుస్తుంది. ఈ మీడియా యాజమాన్యాలకు పాత్రికేయంలో అధికారంలో నిజాల గురించి చేసే వ్యాఖ్యల పై తపన లేదు.
ఈ మహారోగ యుగంలో ఈ దేశ ప్రజలకు జర్నలిజం, ఇంకా జర్నలిస్టుల అవసరం మామూలు కన్నా ఎక్కువగా ఉందని నేను చెబితే మీరు నాతో ఏకీభవిస్తారని నేను భావిస్తున్నాను, సార్. వారి స్వంత పాఠకులు, వీక్షకులతో సహా ప్రజల తీరని అవసరాలకు శక్తివంతమైన మీడియా సంస్థల యజమానులు ఎలా ప్రతిస్పందించారు? 2,000-2,500 మంది జర్నలిస్టులను తొలగించడం ద్వారా, ఇంకా అనేకరెట్ల నాన్ జర్నలిస్టు మీడియా ఉద్యోగులను తొలగించడం ద్వారా.






