కనుచీకటి పడుతోన్న సమయంలో అతను పాడుబడిన తోటలోకి నడిచాడు. బల్ల మీద కూర్చుని, ఒక పెద్ద కర్రనీ, చిన్న ఫోన్నీ తన పక్కనే ఉంచుకున్నాడు. ఒక సంవత్సరం కాలవ్యవధిలో ఆ తోట అలా నిశ్శబ్దంగా ఉండడం ఇది రెండవసారి. పిల్లలూ పెద్దలందరూ మరోసారి తమ ఇళ్లకు తాళాలు వేశారు.
అతను కొన్ని రోజులుగా ఆ తోటకు వస్తున్నాడు. చీకటి పడి వీధి దీపాలు వెలుగుతుండగా, కొమ్మలు నేలపై నీడలు పరిచాయి. చెట్లు కాసింత గాలిని అందించాయి, నేలపై ఎగురుతూ తిరుగాడుతున్న ఎండు ఆకులు పరధ్యానంగా ఆటలాడాయి. అయినప్పటికీ, అతనిలోని చీకటి మరింత లోతుగా పాతుకుపోయింది. నిశ్శబ్దంగా, లోలోపల వెంటాడుతున్న జ్ఞాపకాలతో అతనలా గంటల తరబడి కూర్చునే ఉన్నాడు.
20 ఏళ్ల వయస్సులో ఉన్న ఆ యువకుడు ఇక్కడ కొందరికి సుపరిచితుడు - కాని చాలామందికి అతను అపరిచితుడే. అతని యూనిఫామ్ అతను చేసే పనిని సూచిస్తోంది. సమీపంలోనే ఉన్న ఒక భవనంలో అతను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని పేరు...తెలియదు. దానితో ఎవరికేం అవసరం? ఏడు సంవత్సరాల కాపలా పని తరువాత కూడా తాను పనిచేస్తోన్న అపార్ట్మెంట్ సొంతదారులకు అతనెవరో పరిచయం లేనివాడు
ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ నుంచి అతనిక్కడికి వచ్చాడు. అక్కడ అతని తండ్రి - స్థానికంగా ఒక కవీ, కథకుడూ. తన అభిప్రాయాలను వ్యక్తపరిచినందుకుగాను ఆయన చంపబడ్డాడు. అతని రచనలూ, పుస్తకాలూ –అవే అతని విలువైన ఆస్తులు – ఆగ్రహజ్వాలల్లో కాలిపోయాయి. విరిగి, కాలిపోయిన గుడిసె మాత్రం అలాగే ఉంది. అదేవిధంగా మనసు విరిగి భయపడుతూవున్న ఒక తల్లి , ఆమె పదేళ్ల కొడుకు అందులో ఉంటున్నారు. ఆమెలో భయం వ్యాపించింది. వాళ్ళొకవేళ తన పిల్లాడిని కూడా తీసుకెళ్ళిపోతే? ఆ భయంతోనే ఆమె, వీలైనంత దూరం పరుగెత్తమని తన పిల్లవాడికి చెప్పింది.
అతను చదువుకోవాలనుకున్నాడు, పెద్ద పెద్ద బూట్లు తొడుక్కోవాలనుకున్నాడు. కానీ తానాశ్రయించిన ముంబై నగరంలోని రైల్వే స్టేషన్లలో బూట్లు శుభ్రం చేస్తున్నాడు. అతను కాలువలను శుభ్రం చేశాడు, నిర్మాణ స్థలాల్లో పనిచేశాడు. క్రమంగా తనను తాను గార్డు హోదాకు పెంచుకున్నాడు. తన తల్లికి డబ్బు పంపించేందుకు ఆ ఉద్యోగం సరిపోయేది. త్వరలోనే తల్లి అతనికి పెళ్ళి జరగాలని కోరుకుంది.



