మార్చి నెల 10, 2018 న వాళ్ళు అద్దంకి పట్టణంలో " రామ రావణ యుద్ధం" ప్రదర్శించారు. ప్రకాశం జిల్లాలో జానపద కళలను ప్రోత్సహించే అద్దంకి కళాపీఠం అనే సంస్థ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. రాముడికి రావణుడికి మధ్య యుద్ధం మంచికీ చెడుకీ మధ్య జరిగే యుద్ధంగా చూపించే నాటకం అది. కార్యక్రమంలో అది చివరి ప్రదర్శన కావడంతో రెండు గంటల ప్రదర్శనని ఒక గంటకి కుదించుకోవాల్సి వచ్చింది. రాత్రి 11 అయినా ఆడా మగా అందరూ తోలు బొమ్మలాట చూడడానికి ఉండిపోయారు. ప్రేక్షకుల్లో ఒకరైన 74 ఏళ్ల మాణిక్యాల రావు , చేతిలో బీడీ పట్టుకొని ఆవలిస్తూ అన్నారు " తోలు బొమ్మలాట చూసి చాల కాలం అయ్యింది. అందుకే ఆలస్యం అవుతున్నా వున్నాను".
ఆంధ్రప్రదేశ్లో మిగిలివున్నఅతి కొద్ది తోలుబొమ్మలాట బృందాల్లో 10 మంది సభ్యులున్న కోటిలింగం బృందం కూడా ఒకటి. బృందంలో సభ్యులందరూ మహారాష్ట్రలో మూలాలు కలిగివున్న ఆర్యక్షత్రియ సామజిక వర్గానికి చెందినవారే, అందరూ కోటిలింగం బంధువులే. వీరంతా దక్షిణ కోస్తా ఆంధ్రలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని అద్దంకి , దరిశి , ఒంగోలు లాంటి చిన్న పట్టణాల్లో తోపుడు బండ్ల మీద వ్యాపారమో, కూలీపనో చేసుకుంటూ జీవిస్తున్నారు. మూడు నాలుగు నెలలకొకసారి ఎవరైనా ప్రదర్శనకు పిలిచినపుడు అందరూ బృందంగా కలుస్తారు.
తమ పూర్వీకుల కళారూపాన్ని ఛత్రపతి శివాజీ మరాఠా రాజ్యానికి అనుసంధానం చేస్తూ- ఛత్రపతి శివాజీ సోదరులైన సెర్ఫోజీ, వెంకోజీలు 17వ శతాబ్దంలో మదురై-తంజావూరు ప్రాంతానికి వచ్చి వివిధ కళారూపాలను ప్రోత్సహించారనీ, అందులో ఒకటి ఆర్యక్షత్రియ సామాజికవర్గానికి చెందిన తోలుబొమ్మలాట అనీ- బృందంలోని ముఖ్య స్త్రీ పాత్రధారి, 45 ఏళ్ల వనపర్తి రామాంజునేయమ్మ చెప్పారు.
కోటిలింగం, రామాంజునేయమ్మ ఒకరి తరువాత ఒకరు వంతులు వేసుకుంటూ ఈ మూల కథను వివరించారు: "ఒకానొకప్పుడు, చోళరాజు ఆస్థానంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతనికి కంసలు (ఒక సామాజిక వర్గం: ఆంధ్రలో ప్రస్తుతం కంసాలి అనే పేరుతో ఉంది) అంటే ద్వేషం. రాజును కంసలు చంపడానికి పథకం వేస్తున్నారని ఆ బ్రాహ్మడు ఒక కట్టు కథ అల్లి రాజుని నమ్మించాడు. కంసల తలలు తీయించమని రాజు ఆజ్ఞాపించాడు. బతికివున్న కొద్దిమంది కంసలు జీవనోపాధిని కోల్పోయి అడవులకు పారిపోయారు. అక్కడ చనిపోయిన జంతువుల చర్మంతో బొమ్మలు చేయడం ప్రారంభించి, ఈ జానపద కళను అభివృద్ధి చేసి, బ్రతుకుతెరువు కోసం ప్రజల వద్ద ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. ఆసక్తి కలిగిన ఇతర కులాలవారు కూడా ఈ కళను నేర్చుకున్నారు. ఆరు నెలల పాటు రామాయణాన్ని ప్రదర్శిస్తూ వారు, ప్రతీకారంతో బ్రాహ్మణుడినీ రాజునూ చంపడానికి వేదిక నుండి రాజభవనం వరకు సొరంగం త్రవ్వడం ప్రారంభించారు. ప్రదర్శన చివరి రోజున రాముడు రావణుడిని సంహరించినప్పుడు, వారు బ్రాహ్మణుడ్నీ రాజునూ చంపి, ఆసక్తితో నేర్చుకున్న ప్రజల కోసం తమ కళారూపాన్ని వదిలివేశారు. కాలక్రమేణా, ఈ కళను ప్రదర్శించిన వ్యక్తుల సమూహాన్ని ఆర్యక్షత్రియ అని పిలుస్తున్నారు.”