మే 2021లో రాజేంద్ర ప్రసాద్ భార్యకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ప్రారంభమైనప్పుడు, అతడామెను ఉత్తరప్రదేశ్లోని తన మారుమూల గ్రామానికి దగ్గరగా ఉన్న పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించవలసి వచ్చింది. కాని అతనికి, తన గ్రామానికి అతి సమీపంలోనే ఉన్నప్పటికీ, నేపాల్లోని జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఆసుపత్రికే తీసుకువెళ్లాలని ఉంది.
"సరిహద్దుకు అవతలి వైపు భూభాగంలో చికిత్స పొందడం మాకు సర్వసాధారణం. గ్రామంలోని మాలో చాలా మందిమి సంవత్సరాలుగా అలా చేశాము" అని తన అసాధారణ ప్రాధాన్యాన్ని గురించి వివరిస్తూ చెప్పారు, 37 యేళ్ళ రాజేంద్ర. నేపాల్లోని ఆసుపత్రి రాజేంద్ర స్వగ్రామమైన బన్కటీ నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. బన్కటీ నేపాల్ సరిహద్దులో ఉన్న ఉత్తరప్రదేశ్ జిల్లాలలో అతిపెద్దది అయిన లఖీంపూర్ ఖీరీ (ఖీరీ అని కూడా పిలుస్తారు) కిందికి వస్తుంది.
భారతదేశం, నేపాల్ల మధ్య 1950లో శాంతి మరియు స్నేహ ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుండి, భారతదేశం, నేపాల్లకు చెందిన పౌరులు ఈ రెండు భూభాగాల మధ్య స్వేచ్ఛగా రాకపోకలు సాగించడానికి అనుమతించారు. ఇది వ్యాపారం చేసుకోవడానికి, ఆస్తిని సంపాదించుకోడానికి, ఉపాధిని చేపట్టడానికి వారిని అనుమతిస్తుంది. బన్కాటీ నివాసితుల కోసం, నేపాల్లో చౌకైన, మెరుగైన ఆరోగ్య సంరక్షణను పొందేందుకు ఈ స్వేచ్ఛా సరిహద్దు వీలు కల్పించింది.
కానీ, కోవిడ్-19 ఈ మొత్తం పరిస్థితిని తారుమారు చేసేసింది.
రాజేంద్ర భార్య, 35 ఏళ్ల గీతాదేవిని ఆసుపత్రిలో చేర్చవలసివచ్చినప్పుడు, రెండవ దశ కోవిడ్-19, భారతదేశంలో ముమ్మరస్థాయికి చేరుకుంది. కోవిడ్ -19 వ్యాప్తి చెందిన తర్వాత, నేపాల్ ఐదు భారతీదేశ రాష్ట్రాలమేరా విస్తరించిన తన 1,850 కిలోమీటర్ల సరిహద్దును మార్చి 23, 2020 నుండి మూసివేసినందున వారు సరిహద్దును దాటి అవతలివైపు ఆసుపత్రికి వెళ్లలేకపోయారు.
ఇందువలన రాజేంద్ర కుటుంబం పెద్ద మూల్యాన్నే చెల్లించింది.








