"1901-2003 మధ్య కాలంలో, జూలైలో నమోదయ్యే ఋతుపవన వర్షపాతం (రాష్ట్రమంతటా) తగ్గుముఖం పట్టగా, ఆగస్టు వర్షపాతం పెరిగిందని IMD ఇచ్చిన సమాచారం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, సీజన్ మొదటి పక్షంలో (జూన్ మరియు జూలై), ఋతుపవన వర్షపాతానికి తోడు విపరీతంగా వానలు కురుస్తున్నాయి," అని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (TERI) 2014 లో చేసిన అధ్యయనం పేర్కొంది.
"మహారాష్ట్రలో వాతావరణ మార్పులు, అనుసరణ వ్యూహాల అంచనా: వాతావరణ మార్పులపై మహారాష్ట్ర రాష్ట్ర అనుసరణ కార్యాచరణ ప్రణాళిక," అనే అధ్యయనం, సుదీర్ఘ పొడి వాతావరణం, ఇటీవల వర్షపాత తీరుతెన్నులలో వచ్చిన మార్పులు, తగ్గిన (వర్షపాత) పరిమాణం వంటివి విదర్భ వాతావరణంలో గమనించిన ప్రధాన దుర్బలత్వాలుగా, ఈ అధ్యాయం నొక్కి వక్కాణించింది.
తీవ్ర వర్షపాతం 14-18 శాతం (బేస్లైన్కు సంబంధించి) నమోదైన జిల్లాలలో భండారా ఉందని, ఋతుపవనాల సమయంలో పొడి వాతావరణం కూడా పెరుగుతుందని ఈ ఆధ్యయనం అంచనా వేసింది. నాగ్పూర్ డివిజన్లో (భండారా ఉన్న ప్రదేశం) 1.18 నుండి 1.4 డిగ్రీలు (2030 నాటికి), 1.95 నుండి 2.2 డిగ్రీలు (2050 నాటికి), 2.88 నుండి 3.16 డిగ్రీల వరకు (2070 నాటికి) సగటు పెరుగుదల (వార్షిక సగటు ఉష్ణోగ్రత 27.19 డిగ్రీల కంటే) ఉంటుందని కూడా ఆ అధ్యయనం పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ ఈ జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఉండబోతుంది!
సాంప్రదాయ చెరువులు, నదులు మరియు తగినంత వర్షపాతం కారణంగా, భండారా జిల్లాను 'మెరుగైన నీటిపారుదల' ప్రాంతంగా ప్రభుత్వ రికార్డులు, జిల్లా ప్రణాళికలు ఇప్పటికీ గుర్తిస్తాయి. అయితే, అక్కడి వాతావరణంలో మొదలైన ఈ మార్పులను వ్యవసాయ శాఖ అధికారులు కూడా గమనించారు. "వర్షాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే స్థిరమైన ధోరణిని జిల్లాలో మేము గమనించాం. ఇది విత్తనాలు నాటే ప్రక్రియను, దిగుబడులను దెబ్బ తీస్తోంది," అని భండారాలోని డివిజనల్ సూపరింటెండింగ్ వ్యవసాయ అధికారి మిలింద్ లాడ్ తెలిపారు. “మాకు కనీసం 60-65 రోజులు వర్షాలు కురిసేవి. కానీ, గత దశాబ్ద కాలంలో, జూన్-సెప్టెంబర్ నెలల్లో కేవలం 40-45 రోజులే వానలు పడుతున్నాయి.” ఈ ఏడాది జూన్-జూలైలలో, ఇక్కడ కొన్ని సర్కిళ్లలో (20 రెవెన్యూ గ్రామాల క్లస్టర్లు) కేవలం 6-7 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయని ఆయన అన్నారు.
"ఋతుపవనాలు ఆలస్యం అయితే రైతులు నాణ్యమైన బియ్యాన్ని పండించలేరు. విత్తనాలు మొలకెత్తిన 21 రోజుల తర్వాత వరి నాట్లు వేయకపోతే, ఒక హెక్టారుకు రోజుకు 10 కిలోల చొప్పున ఉత్పత్తి పడిపోతుంది," అని లాడ్ వివరించారు.
సాంప్రదాయ పద్ధతిలో వరి సాగు చేసే విధానం – నాట్లు వేయడం కాకుండా విత్తనాలు మట్టిలో చల్లే విధానం – క్రమంగా జిల్లాకు తిరిగి వస్తోంది. తక్కువ అంకురోత్పత్తి (విత్తనం నుండి మొక్క అభివృద్ధి) రేటు కారణంగా, ఈ పద్ధతిలో తక్కువ దిగుబడి వస్తుంది. కానీ, సమయానికి తొలకరి చినుకులు పడక పైర్లు పెరగకపోతే, మొత్తం పంటను కోల్పోయే పరిస్థితి వస్తుంది. దాని బదులు సాంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తే, రైతులకు పాక్షికంగా మాత్రమే నష్టం జరుగుతుంది.