"బడ్జెట్ అంతా పెద్ద మొత్తాలకు సంబంధించినది. ప్రభుత్వానికి పౌరుడిగా నా విలువ సున్నా!"
‘సర్కారీ బడ్జెట్’ అన్న మాటలు వినగానే చాంద్ రతన్ హల్దార్ తన బాధను దాచుకోవడానికి ప్రయత్నించటం లేదు. “ఏం బడ్జెట్? ఎవరి బడ్జెట్? ఇది పెద్ద బూటకం తప్ప మరొకటి కాదు!" 53 ఏళ్ళ చాంద్ రతన్ కొల్కతాలోని జాదవ్పూర్లో రిక్షా లాగుతుంటారు.
"అనేక బడ్జెట్లు, అనేక పథకాల తర్వాత కూడా మేం దీదీ [ముఖ్యమంత్రి మమతా బెనర్జీ] నుంచి గానీ, మోదీ [ప్రధానమంత్రి] నుంచి గానీ ఒక ఇంటిని పొందలేకపోయాం. మేం ఇప్పటికీ టార్పాలిన్ పైకప్పూ, వెదురు కంచెతో కట్టిన గుడిసెలోనే నివాసముంటున్నాం. అదికూడా ఒక అడుగు లోతున భూమిలోపలికి కుంగిపోయింది," కేంద్ర బడ్జెట్ గురించిన ఆశలు మరింత లోతుకు కుంగిపోయినట్టుగా అన్నారు చందూ దా.
పశ్చిమ బెంగాల్లోని సుభాష్గ్రామ్ పట్టణానికి చెందిన భూమి లేని చాంద్ రతన్, తెల్లవారుజామున శియాల్దాకు వెళ్ళే లోకల్ రైలులో జాదవ్పూర్ చేరుకుంటారు. అక్కడ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళే వరకు పని చేస్తారు. “మా లోకల్ రైళ్లతో పాటే బడ్జెట్లు వస్తాయి, వెళ్తాయి. ఇప్పుడు నగరానికి రావడం చాలా కష్టంగా మారింది. మా ఖాళీ కడుపుల మీద తన్నుతోన్న అలాంటి బడ్జెట్ వల్ల ఉపయోగం ఏమిటి?" అని అడుగుతారాయన.




