అక్కడ ద్వేషం గానీ విచారం గానీ లేవా? 50 ఏళ్ళ క్రితం భారత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలినప్పుడు ఇద్దరూ రెండు భిన్నమైన మార్గాలలో పయనించారు. అది స్నేహ పూర్వకంగా విడిపోవడం కాదు.
"అయితే మేమిద్దరం ఆ తర్వాత కూడా చాలా సమస్యలపై, అలాగే పోరాటాల్లోనూ కలిసి పనిచేశాం," అని నల్లకణ్ణు చెప్పారు. "పార్టీ చీలికకు ముందు ఒకరంటే మరొకరు ఎలా ఉండేవారో ఇప్పుడూ అలాగే ఉన్నారు.".
"మేమిద్దరం కలుసుకున్నప్పుడు ఇప్పటికీ ఒక పార్టీగానే ఉంటాం," అని చెప్పారు శంకరయ్య.
ప్రస్తుతం దేశంలో పెచ్చరిల్లుతోన్న మతోన్మాదం, ద్వేషపూరిత వాతావరణం పట్ల వారి స్పందన ఏమిటి? దేశం మనుగడ గురించి వారు భయపడుతున్నారా? ఏ దేశ స్వాతంత్ర్య సాధన కోసం వారు పనిచేశారో ఆ దేశం గురించి.
"స్వాతంత్ర్య పోరాటంలోనూ కొన్ని సమయాలు నిస్తేజంగా కనిపించాయి," అన్నారు నల్లకణ్ణు. "మీరు గెలవలేరని మాతో చెప్పేవారు. మీరు ప్రపంచంలోని అతి పెద్ద సామ్రాజ్యంతో ఢీకొంటున్నారు. పోరాటాల నుండి దూరంగా ఉండమని మాలో కొన్ని కుటుంబాలకు హెచ్చరికలు వచ్చాయి. కాని మేం ఆ హెచ్చరికలకు, బెదిరింపులకు అతీతంగా ఎదిగాం, పోరాడాం. అందుకే మనం ఈ రోజున ఇలా ఉన్నాం."
విశాల ఐక్యతను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆ ఇద్దరూ చెప్పారు. గతంలో మాదిరిగా మనం ఇతరుల దగ్గరికి వెళ్లాలి, వారి నుండి నేర్చుకొని ముందుకుసాగాలి. "ఇఎంఎస్ (నంబూదిరిపాద్) కూడా తన గదిలో గాంధీ ఫోటోను ఉంచుకునేవారు," అని ఆర్ఎన్కె అన్నారు.
మనలో కోట్లాదిమందిని భయపెడుతోన్న రాజకీయ స్థితి గురించి వారిద్దరూ ఎలా ప్రశాంతంగా, ఆశాభావంతో ఉండగలుగుతున్నారు? నల్లకణ్ణు భుజాలు ఎగురవేశారు: "మేం ఇంతకంటే అధ్వాన్న పరిస్థితులను చూశాం."
తాజా కలం
స్వాతంత్ర్య దినోత్సవం, 2022 – అప్పటికే ది లాస్ట్ హీరోస్: ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ పుస్తకం ముద్రణకు వెళ్ళింది. తమిళనాడు ప్రభుత్వం ఆర్ఎన్కెకు తగైసార్ తమిళర్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇది రాష్ట్రానికి, తమిళ సమాజానికి గొప్పగా సేవలు అందించిన ప్రముఖ వ్యక్తి కోసం తమిళనాడు ప్రభుత్వం 2021లో స్థాపించిన ఉత్తమ బహుమతి. ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాకారాలపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, నగదు బహుమతి రూ. 10 లక్షలను ఆర్ఎన్కెకు అందజేశారు.
అనువాదం: ఎస్. వినయ్ కుమార్