"జనం తమను తాము అలరించుకోవడానికి ఇప్పడు టీవీలు, సెల్ ఫోన్లు ఉన్నాయి," తన ఢోలక్ రింగులను బిగిస్తూ అన్నారు ముస్లిమ్ ఖలీఫా.
ముస్లిమ్ ఖలీఫా 12వ శతాబ్దపు యోధులైన ఆల్హా, ఉదల్ల (రుదల్ అని కూడా అంటారు) పురాణ జానపద కథలను పాడతారు. బిహార్లోని సమస్తీపుర్ జిల్లాకు చెందిన జానపద గాయకుడు, ఢోలక్ వాద్యగాడు అయిన ఈయన దాదాపు ఐదు దశాబ్దాలుగా దీన్ని గానం చేస్తున్నారు. పదునుగానూ వినసొంపుగానూ ఉన్న అతని స్వరం చాలాకాలంగా పాడుతోన్న ఒడుపును తెలియచేస్తోంది.
వరి, గోధుమ, మొక్కజొన్న పంటలు కోసే ఏప్రిల్-మే నెలల్లో, ఆయన తన ఢోలక్తో పొలాల వెంట తిరుగుతూ వ్యవసాయపు పనుల్లో మునిగివున్న జనం కోసం పాడుతుంటారు. సుమారు రెండు గంటల ప్రదర్శనకు ప్రతిఫలంగా ఆయనకు కొత్తగా పండించిన పంట నుంచి 10 కిలోల ధాన్యం లభిస్తుంది. "ఈ మూడు పంటల కోతలకు ఒక నెల రోజుల కాలం పడుతుంది, కాబట్టి నేను ఆ నెలంతా పొలాల్లోనే గడుపుతాను," అని ఆయన చెప్పారు. పెళ్ళిళ్ళ కాలంలో పెరిగిపోయే గిరాకీ వలన ఆయన ఆ మూడు నెలల్లో రూ.10,000-15,000 దాకా సంపాదిస్తారు.
52 భాగాలుగా వర్ణించే విస్తారమైన ఈ పాటను పూర్తిగా చెప్పడానికి చాలా రోజులు పడుతుంది, నిబద్ధతతో పాటలో లీనమయ్యే ప్రేక్షకులను ఈ పాట కోరుకుంటుంది. "అయితే, ఈ రోజుల్లో ఎవరు అన్ని రోజులు వింటారు?" అని ఖలీఫా ప్రశ్నించారు. ఖాలిస్పుర్ గ్రామానికి చెందిన ఈ 60 ఏళ్ళ మనిషి ఇప్పుడు పాట ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడాన్ని చూస్తున్నారు. ఆయన స్వంత పిల్లలు సైతం ఆల్హా-ఉదల్పై ఆసక్తి చూపించడం లేదని ఆయన విచారిస్తున్నారు.
ఖలీఫా ఇస్లామ్ను అనుసరిస్తారు కానీ నట్ సముదాయానికి చెందినవారు. ఇది రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులంగా జాబితా అయివుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నట్ సముదాయపు జనాభా 58,819 ఉంది, కానీ "మీరు 10-20 గ్రామాలకు ఇలాంటి ఆల్హా-ఉదల్ గాయకులను ఒకరిద్దరిని మాత్రమే చూడగలరు," అని మే 2023లో మాతో మాట్లాడుతూ ఖలీఫా చెప్పారు










