గణేశ్ శిందే దగ్గరున్న విలువైన ఆస్తి ఆయన 2022లో కొనుగోలు చేసిన ఒక ఎర్రని ట్రాక్టర్. మహారాష్ట్ర, పర్భణీ జిల్లాలోని ఖలీ గ్రామానికి చెందిన శిందే, తన సొంతానికున్న రెండెకరాల భూమిని సాగుచేస్తున్నారు. కానీ ఇటీవలి సంవత్సరాలలో పత్తి ధరలు బాగా పడిపోతుండటంతో, అదనపు ఆదాయ వనరుల కోసం వెతుక్కోవటం శిందేకు తప్పనిసరైంది. అది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు నుంచి రూ 8 లక్షలు అప్పు తీసుకొని ఒక ట్రాక్టర్ కొనడానికి దారితీసింది.
"నేను మా ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాఖేడ్ వద్దకు ట్రాక్టర్ను నడుపుకుంటూ వెళ్ళి అక్కడి జంక్షన్లో ఎదురుచూస్తూ ఉంటాను," అన్నారు 44 ఏళ్ళ వయసున్న ఈ రైతు. అక్కడికి సమీపంలో ఏమైనా నిర్మాణ పనులు జరుగుతుంటే, ఇసుక వంటి వస్తువులను రవాణా చేయడానికి వాహనం అవసరమైనవారు నా ట్రాక్టర్ను ఉపయోగించుకుంటారు. అలా నాకు పని దొరికిన రోజుల్లో నేను 500 నుండి 800 రూపాయల వరకూ సంపాదిస్తాను." పొద్దున్నే గంగాఖేడ్కు బయలుదేరే ముందు, శిందే తన పొలంలో కనీసం రెండు గంటలైనా గడుపుతారు.
బడ్జెట్ 2025ను ఆయన చాలా శ్రద్ధగా విన్నారు. ఆ వినటం ప్రత్యేకించి బడ్జెట్ మీద పెద్ద ఆశలు ఉండి కాదనీ, తన ట్రాక్టర్ సేవలకోసం వచ్చే జనం కోసం ఎదురుచూస్తూ, మరి చేసే పనేమీ లేక విన్నానని శిందే చెప్పారు. "ఎమ్ఎన్ఆర్ఇజిఎ (మహాత్మా గాంధీ దేశీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005) కోసం కేటాయింపులనేమీ పెంచలేదు," అన్నారాయన. ఖలీ గ్రామ మాజీ సర్పంచ్ అయిన శిందే, ఎమ్ఎన్ఆర్ఇజిఎ వల్ల గ్రామంలో పెద్ద మార్పేమీ రాలేదన్నారు. “ఉపాధిని కల్పించడానికి ఆ డబ్బు పెద్దగా ఉపయోగపడలేదు. అదంతా కాగితాల పైన మాత్రమే ఉంది.”



