పావగడ, చూసేందుకు కన్నులవిందుగా ఉంటుంది. వీధులలో గుత్తులుగా కాగితం పూలు, రంగు రంగుల ఇళ్లు, అలంకరించబడిన గుళ్లు, గోపురాలు, వాటిలో నుండి వచ్చే సంగీతం. ఇవన్నీ, కర్ణాటకలోని తుంకూరు జిల్లాలోని ఈ పల్లెటూరిలో రోజూ నడిచేవారికి సుపరిచితం. చూడటానికి అందంగా ఉన్నా, నిజానికి ఇందులో అందం లేదు. ఎందుకంటే ఇక్కడ విషయం మానవ వ్యర్థాలైన మ*మూ*ల గురించి కాబట్టి.
మధ్య తరగతి వారి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండటానికి, ఈ పదాలను పూర్తిగా రాయకుండా, * వాడి దాచాల్సి వస్తోంది. కానీ అంతటి అదృష్టానికి రామాంజనప్ప నోచుకోలేదు. పావగడ తాలూకా లోని కన్నమేడి అనే పల్లెటూరిలోని పారిశుద్ధ్య కార్మికుడైన ఈయన "మలాన్ని నేను ఒట్టి చేతులతో కడుగుతాను," అని చెప్పారు. అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదనుకుంటే, ఇలా తనలోని మానవత్వాన్ని అణగదొక్కే ఈ పనికి సాంత్వన చేకూర్చాల్సిన ఒకే ఒక్క విషయంలోనూ ఎదురు దెబ్బలు తప్పవు: చివరిసారి రామాంజనప్పకు జీతం వచ్చింది అక్టోబరు 2017లో.
టౌన్ హాల్ గోడల మీద చెత్తను వేరు చేయడం గురించిన పెయింటింగ్స్ ఉన్నాయి, ఉండాలి కూడా. కానీ, అవి అధికారుల కంటితుడుపు చర్యలో భాగం మాత్రమేనని, మాదిగ కులానికి చెందిన దళితులైన 20 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఆ గోడలకు 30 అడుగుల దూరం కూడా లేని అంబేద్కర్ భవన్లోని ఒక సభలో, వారి నిస్సహాయ స్థితిని వివరిస్తూ మాకు చెప్పారు.
నెల నెలా తాను అందుకునే రూ. 3400తో, భార్య, స్కూలుకు వెళ్లే ముగ్గురు పిల్లలతో ఐదు మంది ఉన్న కుటుంబాన్ని పోషించడానికే కష్టమయ్యేది. అలాంటిది, ఆ కొంత జీతం వచ్చి కూడా తొమ్మిది నెలలు అవుతోంది.
కొందరికి జీతాలు రాకపోగా, ఇంకొందరికి నెలల ముందే ఇస్తామని చెప్పిన ఇంక్రిమెంట్ రాలేదు.












