"నాకు రేషన్ షాపు నుండి బియ్యం ఎందుకు రావడంలేదు?" జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వ జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించటానికి తుమ్మలలోని ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన మండల అధికారులను అడిగారు మహమ్మద్.
తుమ్మల గ్రామంలో ఉన్న అతని రేషన్ కార్డులో మహమ్మద్ పేరు కనిపించకుండాపోయి, అక్కడికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూలు నగరంలోని రేషన్ కార్డులో కనిపించింది. "కొందరి పేర్లు వైజాగ్ (800 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం) వంటి ప్రాంతాలలో కూడా కనిపిస్తున్నాయి," అని అధికారి బదులిచ్చారు.
అక్టోబరు 2016లో తన ఆధార్ నంబర్ను రేషన్ కార్డుకు జోడించినప్పటి నుండి, పఠాన్ మొహమ్మద్ అలీఖాన్ తనకు రావలసిన రేషన్ను పొందలేకపోతున్నారు. 52 ఏళ్ళ ఈ కూరగాయల వ్యాపారి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధార్, రేషన్ కార్డులను జోడించడాన్ని తప్పనిసరి చేసిన వెంటనే తన ఆధార్నూ, రేషన్ కార్డునూ జోడించేశారు. ఇలా చేసిన కొద్ది వారాల్లోనే, అనంతపురం జిల్లా అమడగూరు మండలం తుమ్మల గ్రామంలోని ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు చెందిన రేషన్ దుకాణంలో అతనికి సమస్యలు మొదలయ్యాయి.
అలీ లాంటి బిపిఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న) రేషన్ కార్డులున్నవారు ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన దుకాణానికి వెళ్ళినప్పుడల్లా, దుకాణదారుడు కుటుంబ రేషన్ కార్డ్ నంబర్ను అడిగి, దానిని ఒక చిన్న యంత్రంలోకి పంపుతాడు. అప్పుడు ఆ పరికరం కుటుంబ సభ్యుల జాబితాను చూపెడుతుంది. ఆ కార్డుదారుడి వేలిముద్రలతో దీన్ని ధ్రువపరచిన తర్వాత యంత్రం చూపించే వ్యక్తుల సంఖ్యను బట్టి దుకాణదారుడు రేషన్ ఇస్తాడు. అయితే అతని కుటుంబ రేషన్ కార్డులో ఉన్న పేర్ల జాబితాలోంచి అలీ పేరు మాయం అయ్యింది. "నేను చాలాసార్లు దుకాణానికి వెళ్ళాను, అయినా జాబితాలో నా పేరు లేదు,” అని ఆయన చెప్పారు. “మా నంబర్ను యంత్రంలో పంచ్ చేసినప్పుడు, ఐదు పేర్లు కనిపించాలి. కానీ నలుగురువి మాత్రమే కనిపిస్తున్నాయి. నా పేరు లేదు. అందులో పేరు ఉంటేనే వేలిముద్రలు పనిచేస్తాయి. లేకపోతే అవి పనిచేయవు."










