తన తండ్రి వర్ధంతి సందర్భంగా, తిరు మూర్తి అసాధారణమైన నైవేద్యాన్ని సమర్పించాడు: పది రకాల సబ్బులు, అనేక రకాల కొబ్బరి నూనె, అతని ఉత్పత్తులన్నింటిలో గొప్పదైన: పసుపు పొడి. ఇవిగాక, ఎర్ర అరటిపండ్లు, పువ్వులు, కొబ్బరికాయల తో పాటు, వెలిగించిన కర్పూరాన్ని సుందరమూర్తి చిత్రపటం ముందు పెట్టాడు.
"అప్పాకి ఇంతకంటే మంచి నివాళి ఏముంటుంది?" అని ఫేస్బుక్ పోస్ట్లో ప్రశ్నించాడు. అతని తండ్రి మంజల్ (పసుపు) వ్యవసాయాన్ని మానేశాడు. అందరూ వద్దని చెప్పినా తిరు ఆ పనినే తిరిగి మొదలుపెట్టాడు. “పూల వల్ల రోజువారీ ఆదాయం వస్తుంది కాబట్టి మల్లి(మల్లెపూవు తోట)ని పెంచమని చెప్పారు. నేను మంజల్ నాటినప్పుడు వారు నన్ను చూసి నవ్వారు,” అని అతను నవ్వాడు. వారు చెప్పినది తప్పని తిరు నిరూపించాడు. అతని కథ అరుదైనది: ఇది పసుపుతో సాధించిన విజయం.
నలభై మూడేళ్ళ తిరు మూర్తి, తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని భవానీసాగర్ బ్లాక్లోని ఉప్పుపాళం కుగ్రామంలో తన అన్నయ్యతో కలిసి ఉమ్మడిగా కలిగి ఉన్న 12 ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు. అతను మూడు పంటలు పండిస్తాడు - పసుపు, అరటి, కొబ్బరి. కాని అతను వాటిని హోల్సేల్గా విక్రయించడు. ధరలపై తనకు నియంత్రణ లేనప్పుడు అది అర్థరహితమని అతను చెప్పాడు. ఈ రేట్లను - స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా- పెద్ద వ్యాపారులు, కార్పొరేట్లు, ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.
అభివృద్ధి చెందుతున్న పసుపు మార్కెట్లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాత్ర వహిస్తుంది. 2019లో మన దేశం చేసిన ఎగుమతులు $190 మిలియన్లకు చేరుకున్నాయి - ఇది ప్రపంచ వాణిజ్యంలో 62.6 శాతం. అయితే ఇక్కడ విషయమేమిటంటే: దిగుమతులలో కూడా భారతదేశం రెండవ స్థానంలో ఉంది, అంటే 11.3 శాతం వరకు పసుపును మన దేశం దిగుమతి చేసుకుంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా దిగుమతులలో సాగుతున్న ఈ భారీ పెరుగుదల, భారతీయ పసుపు సాగుదారుల ప్రయోజనాలను దెబ్బతీసింది.
దేశీయ మార్కెట్లు - ఈరోడ్లోని మండీలు - ఇప్పటికే వారిని పిండుతున్నాయి. పెద్ద వ్యాపారులు, కొనుగోలుదారులు విలువను నిర్ణయిస్తారు. సేంద్రీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ధర లేదు, అంతేకాకుండా, ప్రతి ఏడాదికి అస్థిరత పెరిగిపోతోంది. 2011లో క్వింటాల్ పంటకు రూ. 17,000 ధర పలికితే, మరుసటి సంవత్సరం, అది ఆ ధరలో దాదాపు నాల్గవ వంతుకు పడిపోయింది. 2021 సగటు ధర, క్వింటాలుకు దాదాపు రూ. 7,000.
చాతుర్యం, పట్టుదల, సోషల్ మీడియా సహాయంతో, తిరు సరళమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు: విలువ జోడింపు. అతని ప్రయత్నం వేరే ప్రదేశాలలో పెద్దగా ప్రయత్నించనప్పటికీ, ఇక్కడ మాత్రం విజయవంతమైంది. “పొలం వద్ద 10 రూపాయలు పలికే ఒక్క కొబ్బరికాయ, నాకు మూడు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుంది. కొబ్బరితో నేను నూనెను, సబ్బును తయారుచేస్తాను. పసుపుతోనూ ఇదే కథ’’ అని ఆయన వివరించారు. “నేను దానిని 1.5 ఎకరాల్లో పెంచుతాను. నేను మండిలో 3,000 కిలోల సేంద్రియ పసుపును అమ్మవలసి వస్తే, నాకు దాదాపు 50 రూపాయల నష్టం వస్తుంది.”



























