“మా ఇళ్లలో ఎలుకలు పైకప్పు మీద నుండి పడి చనిపోవడం నాకు గుర్తుంది. నేను ఇప్పటిదాకా చూసిన వాటిలో అత్యంత అరిష్టాన్ని తెచ్చిన దృశ్యం ఇదే. ఈ రోజు మీకు నవ్వు రావొచ్చు, కాని పైకప్పు నుండి ఎలుక పడిపోవడం అంటే మేము ఇళ్లన్నీ వదిలి వెళ్ళిపోవాలి, మళ్ళీ తిరిగి ఎప్పుడు రాగలమో మాకే తెలియదు.”
ఈ దృశ్యమానం అంతా కోయంబత్తూర్లోని కాలాపట్టి నివాసి అయిన ఎ. కుళధయమ్మాళ్ నుండి వచ్చింది. ఇప్పుడు ఆమె 80వ దశకంలో ఉంది. 1940వ దశకం ప్రారంభంలో తమిళనాడులో చివరిసారిగా ప్లేగు వ్యాధి సోకినప్పుడు ఆమె ఇంకా కౌమార దశకు కూడా రాలేదు.
కోయంబత్తూర్లోని అంటువ్యాధుల విషాద చరిత్ర - మశూచి నుండి ప్లేగు, ప్లేగు నుండి కలరా వరకు - ఇలా వేరే ప్రాంతాల్లో కూడా వ్యాధి వచ్చినా, ఇక్కడ మాత్రమే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్న ఒక పద్ధతిని చూసింది. ఇక్కడ 'ప్లేగ్ మారియమ్మన్' ('బ్లాక్ మారియమ్మన్' అని కూడా పిలుస్తారు) దేవాలయాలు విస్తరించాయి. ఈ నగరంలోనే ఇటువంటి 16 దేవాలయాలు ఉన్నాయి.
అయితే, కోవిడ్ -19 మహారోగం వలన 'కరోనా దేవి' ఆలయం కూడా ఆవిర్భవించింది. కానీ ప్లేగు మారియమ్మన్ పుణ్యక్షేత్రాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పొరుగునే ఉన్న తిరుప్పూర్ జిల్లాలో దేవాలయాలు, కొన్ని పండుగలను కూడా నిర్వహించి సందర్శకులను ఆకర్షిస్తాయి.
1903 నుండి 1942 వరకు, కోయంబత్తూర్లో కనీసం 10 సార్లు ప్లేగు వచ్చింది. వేలాది మంది ప్రజలు మరణించారు. అది విడిచిపెట్టిన దశాబ్దాల తరువాత కూడా ప్లేగు ఈ నగర సామూహిక జ్ఞాపకాలలో బంధింపబడి ఉంది. కుళధయమ్మాళ్ వంటి చాలా మంది పెద్దవాళ్లకు, ప్లేగు వ్యాధి గురించి చేసిన ప్రస్తావన, భయపెట్టే నగరం వాతావరణంలో వారు జీవించిన చరిత్రను గుర్తుచేస్తుంది.
సందడిగా ఉండే టౌన్ హాల్ ప్రాంతంలోని ప్లేగు మారియమ్మన్ దేవాలయాలన్నిటిలోనూ అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం బయట, పూల వ్యాపారి సాయంత్రం జరిగే గిరాకీలకు సిద్ధంగా ఉన్నాడు. "ఈ రోజు శుక్రవారం. చాలా మంది వస్తారు,” అని 40 ఏళ్ల వయస్సులో ఉన్న కనమ్మాళ్, పువ్వులను కట్టే చేతుల మీద నుండి కళ్ళు ఎత్తకుండా చెప్పింది.
"ఆమె చాలా శక్తివంతమైనది, తెలుసా. మాకు ఇప్పుడు కరోనా దేవి గుడి ఉన్నాగాని, నల్ల మరియమ్మన్ మనలో ఒకరు. మేము ఆమెను ఆరాధిస్తూనే ఉంటాము, ప్రత్యేకించి మాకు ఆరోగ్యం బాలేనప్పుడు. అంతేగాక వేరే సాధారణ ప్రార్థనల కోసం కూడా.” 'సాధారణ ప్రార్థనలు' అంటే ఆమె భక్తుల సాధారణ డిమాండ్లు - ఐశ్వర్యం, విజయం, దీర్ఘాయువు ఇటువంటివి. ప్లేగు శకం ముగిసిన దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కనమ్మాళ్ జన్మించింది. కానీ ఆమె తరానికి చెందిన చాలా మంది, సహాయం కోసం మరియమ్మన్ వద్దకు వస్తారు.












