ఈ పగుళ్ళపై మీడియాలో వార్తలే వార్తలు. చమోలీ జిల్లాలోని ఒక కొండపై ఉన్న తమ పట్టణం కుంగిపోతుండటాన్ని గురించి రోజూ ఓ కొత్త వార్త చదువుతోందామె. గ్రామాలలో విచ్చుతున్న నెర్రెలనూ, పట్టణాలలో వెల్లువెత్తుతున్న నిరసనలనూ చూడ్డానికి పాత్రికేయులు పోటెత్తుతున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలని కిందటివారం వాళ్లొచ్చి చెప్పిప్పుడు ఆమె తన చిన్న ఇంటిని వదిలేసి వెళ్లడానికి ససేమిరా అంది. వాళ్ళనే ఈడ్చి పడెయ్యనివ్వు. ఆమెకేం భయంలేదు..
అవి పగుళ్ళు మాత్రమే కావని, ఏదో సరికొత్త దురాశ ఊరి నేలగుండా సొరంగాల్ని తవ్విందని అనుకుంటోందామె. పర్వతాలను దురాక్రమిస్తున్న కొత్త ప్రాజెక్టులు, రహదారులు మాత్రమే కాదు; మరేదో లోతైనది లోకవిరుద్ధమైనది. ఇప్పటికే విభజన జరిగిపోయింది. పర్వతాల లతకు వేలాడుతున్న స్వప్నాన్ని వెంటాడుతూ వారు, ప్రకృతికి భూలోక దేవతలకు తమంతట తామే దూరమయ్యారు. అదొక మాంత్రిక లత. ఆ వెర్రి భ్రమకు ఎవరిని నిందించాలి?



