కడలూరు చేపల రేవులో వ్యాపారం ప్రారంభించేనాటికి ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలే. ఆమె దగ్గర ఉన్నదల్లా కేవలం రూ. 1800; అది వ్యాపారం ప్రారంభించడానికి ఆమె తల్లి ఇచ్చిన పెట్టుబడి. ఈనాడు 62 ఏళ్ళ వేణి, ఓడరేవులో ఒక విజయవంతమైన వేలంపాటదారు, వ్యాపారీ కూడా. తాను చాలా కష్టపడి నిర్మించుకున్నందుకు గర్వపడే ఇంటిలాగే, ఆమె తన వ్యాపారాన్ని కూడా "అంచెలంచెలుగా" నిర్మించుకున్నారు.

మద్యానికి బానిసైన భర్త తనను విడిచిపెట్టిన తర్వాత వేణి ఒక్కచేతిమీదుగా తన నలుగురు పిల్లలను పెంచారు. ఆమె రోజువారీ సంపాదన చాలా తక్కువగా ఉండేది, కనాకష్టంగా జీవించడానికి మాత్రం సరిపోయేది. రింగుల వలలు రంగంలోకి రావడంతో, ఆమె లక్షల్లో అప్పులు చేసి పడవలపై పెట్టుబడి పెట్టారు. ఆమె పెట్టుబడికి వచ్చిన రాబడి తన పిల్లలను చదివించడానికి, ఇల్లు కట్టుకోవడానికి వీలు కల్పించింది.

రింగుల వలలతో చేపల వేట 1990ల చివరి నుండి కడలూరు తీరంలో ప్రజాదరణ పొందింది. అయితే 2004 సునామీ తర్వాత దీని వినియోగం వేగంగా పెరిగింది. సముద్రపు ఉపరితల జలాల్లో తిరుగాడే కవళ్ళు (sardine), కనగర్తలు (mackerel), నెత్తళ్ళు (anchovies) వంటి చేపల గుంపులను రింగుల వల ద్వారా చుట్టుముట్టే పద్ధతులను ఉపయోగించి పట్టుకుంటారు.

వీడియో చూడండి: 'నేను కష్టపడి పనిచేయడం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను'

భారీ మూలధన పెట్టుబడుల అవసరం, కార్మికుల అవసరం కారణంగా చిన్నస్థాయి మత్స్యకారులు వాటాదారుల సమూహాలను ఏర్పరుచుకున్నారు; ఖర్చులూ రాబడీ రెండింటినీ పంచుకున్నారు. ఇలా వేణి పెట్టుబడిదారుగా మారి తన వ్యాపారాన్ని పెంచుకున్నారు. రింగుల వలలు ఉపయోగించే పడవలు వేలంపాటదారులుగా, విక్రయదారులుగా, చేపలను ఎండబెట్టేవారుగా మహిళలకు అవకాశాల తలుపులను తెరిచాయి. "రింగుల వలకు ధన్యవాదాలు, దానివలన సమాజంలో నా స్థాయి పెరిగింది" అని వేణి చెప్పారు. "నేను సాహసిక మహిళనయ్యాను, జీవితంలో ఎదిగాను."

పడవలు పురుషులకే ప్రత్యేకించిన ప్రదేశాలు అయితే, అవి ఓడరేవులోకి దిగిన వెంటనే - చేపల పంటను వేలం వేయడం దగ్గరనుండి చేపలను విక్రయించడం వరకు, చేపలను కోయడం, ఎండబెట్టడం నుండి చేపల వ్యర్థాలను తొలగించడం వరకు, మంచు దిమ్మలను అమ్మడం నుండి టీ, వండిన ఆహారాన్ని అమ్మడం వరకూ - మహిళలు వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. మత్స్యకార మహిళలు సాధారణంగా చేపల విక్రయదారులుగా వర్గీకరించబడినప్పటికీ, చేపల నిర్వహణను చేపట్టే స్త్రీలు కూడా వీరితో సమాన సంఖ్యలో ఉన్నారు; వారు తరచుగా అమ్మేవారితో భాగస్వామ్యంతో పనిచేస్తారు. కానీ మత్స్య పరిశ్రమ రంగానికి మహిళల సహకారం యొక్క విలువ, వైవిధ్యం రెండింటికీ చాలా తక్కువ గుర్తింపు ఇవ్వబడింది.

వీడియో చూడండి: కడలూరులో చేపల నిర్వహణ

వేణి వంటి మహిళలకూ, వయసులో చిన్నవారైన భానుకు కూడా వారి ఆదాయాలు వారి కుటుంబాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తాయి. కానీ వారి పనిని గౌరవం, సామాజిక విలువ లేనివిగా చూస్తారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగా కూడా వారి దోహదాలు కనిపించనీయరు.

పసి చేప పిల్లలతో సహా అతిగా మత్స్యసంపదను పట్టివేయడం, సముద్ర పర్యావరణాన్ని నాశనం చేయడంలో పాత్ర పోషించినందుకు 2018లో, తమిళనాడు ప్రభుత్వం రింగుల వలలను నిషేధించింది. ఈ  నిషేధం వేణినీ, ఆమె వంటి అనేక ఇతర మహిళల జీవనోపాధిని నాశనం చేసింది. ఒక్క రోజులో ఆమె సంపాదన 1 లక్ష రూపాయల నుండి రోజుకు 800-1,200 రూపాయలకు పడిపోయింది. "రింగుల వలలపై నిషేధం కారణంగా నేను దాదాపు 1 కోటి రూపాయలను కోల్పోయాను" అని వేణి చెప్పారు. "నేను మాత్రమే కాదు, లక్షల మంది ప్రజలు దెబ్బతిన్నారు."

అయినప్పటికీ మహిళలు కష్ట సమయాల్లో ఒకరికొకరు మద్దతుగా పనిచేస్తూనే ఉన్నారు, సంఘీభావాన్ని పెంపొందించడానికి సమయాన్ని వెచ్చిస్తారు, వదులుకోరు.

వేణి పై చిత్రీకరించిన చిత్రానికి తారా లారెన్స్ , నికోలస్ బాట్స్ రచనా సహకారాన్ని అందించారు .

ఇది కూడా చదవండి : పులి గవ్వలు, పొలుసులు, తలలు, తోకలతో జీవిక సాగిస్తోంది

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Nitya Rao

Nitya Rao is Professor, Gender and Development, University of East Anglia, Norwich, UK. She has worked extensively as a researcher, teacher and advocate in the field of women’s rights, employment and education for over three decades.

Other stories by Nitya Rao
Alessandra Silver

Alessandra Silver is an Italian-born filmmaker based in Auroville, Puducherry, who has received several awards for her film production and photo reportage in Africa.

Other stories by Alessandra Silver
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli