చంపత్ నారాయణ్ జంగలే చనిపోయిన ప్రదేశం రాళ్ళతో నిండివున్న ఒక ప్రత్తి పొలంలో ఉంది.
మహారాష్ట్ర చుట్టుపక్కల ఉండే ఈ ప్రాంతాలను హల్కీ జమీన్ లేదా నిస్సార భూమి అంటారు. ఆంధ్ వంశానికి చెందిన ఎత్తుపల్లాలతో నిండివున్న ఈ భూమికి పచ్చని కొండలు అందమైన నేపథ్యాన్ని అందిస్తాయి. ఇది గ్రామానికి దూరంగా ఉండే వ్యవసాయ భూమి.
వేటకు వచ్చే అడవి పందుల నుండి తన పొలాన్ని రక్షించుకోవడానికి చంపత్ తన పొలంలో రేయింబవళ్ళు కాపలా కాసేవారు. చర్రున కాల్చే ఎండనుండీ, కురిసే వానలనుండీ రక్షణ కోసం చంపత్ గడ్డితో కట్టుకున్న గుడిసె- ఇప్పటికీ కనుచూపు మేర బండరాళ్లతో నిండి కనిపిస్తోన్న ఆ ప్రదేశంలో నిలిచివుంది. పొలాన్ని కాపలా కాస్తూ అతనెప్పుడూ అక్కడే ఉండేవాడని అతని పొరుగువారు గుర్తు చేసుకున్నారు.
అంధ్ తెగకు చెందిన ఈ ఆదివాసీ రైతు చంపత్ (సుమారు 45 సంవత్సరాలు), ఆ గుడిసె నుండే తన పొలం మొత్తాన్ని చూసుకుంటూ ఉండేవారు. అంతులేని నష్టం, కాయలు కాయకుండా దెబ్బతిన్న మొక్కలు, మోకాళ్ల ఎత్తున పెరిగిన కంది మొక్కలు ఆయనకు కనిపించేవి.
రెండు నెలల్లో మొదలయ్యే కోతల కాలంనాటికి ఈ పొలాలు ఏమీ పండవని ఆయనకు సహజంగానే తెలిసి ఉండాలి. ఆయనకు తీర్చాల్సిన అప్పులున్నాయి, కుటుంబ రోజువారీ ఖర్చులు చూసుకోవాల్సిన అవసరమూ ఉంది. కానీ డబ్బు మాత్రం లేదు.
















