"దాదాపు ముప్పయ్యేళ్ళ క్రితం స్పీతీలో మంచు విపరీతంగా పడేది. అక్కడంతా పచ్చగా ఉండి, గడ్డి కూడా చాలా బాగుండేది," అన్నారు హిమాచల్ప్రదేశ్లోని లాహౌల్-స్పీతీ జిల్లాకు చెందిన పశువుల కాపరీ, రైతు కూడా అయిన ఛేరింగ్ అంగ్దుయి.
43 ఏళ్ల ఛేరింగ్ సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉన్న లాంగ్జాలో నివసిస్తున్నారు. ఆయనతో పాటు మరో 158 మంది కూడా అక్కడ నివసిస్తున్నారు (2011 జనాభా లెక్కలు). వారిలో ఎక్కువమంది రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేయబడిన భోట్ సముదాయానికి చెందినవారు. గ్రామంలో నివసించేవారు ఎక్కువగా వ్యవసాయం, పశువుల పెంపకం, పర్యాటకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు
జూలై 2021 చివరలో మేం ఛేరింగ్నీ మరికొంతమంది పశువుల కాపరులనూ తమ పశువులను, గొర్రెలను, మేకలను మేపుతుండగా లాంగ్జాలో కలిశాం. తమ పశువులకు గడ్డి కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందని అప్పుడు వారు మాట్లాడారు.
"ఇప్పుడిక్కడ కొండల్లో మంచు తక్కువగా పడుతోంది. అలాగే వర్షం కూడా ఎక్కువగా పడటంలేదు. దాంతో గడ్డి కూడా మంచిగా పెరగదు," అంటారు ఛేరింగ్. "అందుకనే మేం మా జీవాలను మేత కోసం మరింత ఎత్తుకు తీసుకుపోతాం.”











