“కొంటున్న కొద్దీ అప్పుల్లో మునిగిపోతున్నాము.” అన్నది 40 ఏళ్ళ రైతు, కునారి సబారి, తన సాయెరా ఆదివాసీలు నివసించే ఖైరా గ్రామంలో మాతో సంభాషిస్తూ.
"గోబరఖాతచాసా, హలాచాసా [ఆవు పేడ, నాగలితో వ్యవసాయం], ఇది మాది, కానీ ఇప్పుడు ఎవరూ ఆ వ్యవసాయం చేయడం లేదు," అని ఆమె చెప్పింది. “ఇప్పుడు మేము ప్రతిదానికీ మార్కెట్కి పరిగెత్తుతున్నాము. విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల కోసం. ఇంతకు ముందులా కాకుండా మేము తినేది కూడా కొనాల్సిందే.”
ఒడిశాలోని రాయగడ జిల్లాలో పర్యావరణపరంగా సున్నితంగా ఉండే ఎత్తైన ప్రాంతాలలో వేళ్లూనుకుంటున్న పత్తి సాగు పై ఆధారపడటాన్ని గురించే కునారి చెబుతుంది. ఈ సాగు పధ్ధతితో అక్కడి గొప్ప జీవవైవిధ్యం, రైతుల కష్టాలు, ఆహార భద్రతకు సంబంధించిన లోతైన చిక్కులు ముడిపడి ఉన్నాయి (చూడండి: ఒడిషాలో వాతావరణ సంక్షోభ విత్తనాలను నాటడం). మేము రాయగడలోని గుణుపూర్ బ్లాక్ మైదానానికి ఆగ్నేయంలో దిగినప్పుడు ఇది స్పష్టంగా కనిపించింది. ఇక్కడికే పత్తి మొదట వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రదేశంలోని పొలాలలో కంటికి కనిపించేంత మేరకు పత్తి పంట మాత్రమే ఉంది. కాని ఇక్కడ లోతైన బాధ కూడా ఉంది.
‘‘10-12 ఏళ్ల క్రితం పత్తి సాగు మొదలుపెట్టాం. మాకు వేరే మార్గం లేదు కాబట్టి మేము ఇప్పుటికీ పత్తిని చేస్తూనే ఉన్నాము.” అని గుణుపూర్ బ్లాక్లోని ఖైరాలో చాలామంది మాకు చెప్పారు. ఈ ప్రాంతంలోని ఎందరో రైతులు, పెట్టుబడి పెట్టిన పత్తి వైపు మొగ్గు చూపడంతో, తమ సొంత విత్తనాలను, బహుళ పంటల సాంప్రదాయ పద్ధతులను క్రమంగా కోల్పోయామని వారు చెప్పారు.
"మాకు మా స్వంత పంటలు, మా స్వంత వ్యవసాయం ఉండేవి," అన్నాడు యువ రైతు, ఖేత్రా సబరా. “ఆంధ్రా వాళ్ళు వచ్చి పత్తి పండించమని చెప్పారు, అన్నీ నేర్పించారు.” ఇక్కడ ఉన్న మరొక రైతు సంతోష్ కుమార్ దండసేన, గ్రామస్తులను, లాభం పొందే అవకాశమే కప్పా లేదా పత్తి వైపు ఆకర్షించిందని తెలిపారు. “మొదట్లో సంతోషపడ్డాము, డబ్బు సంపాదించాము. కానీ ఇప్పుడు ఈ రకమైన వ్యవసాయం కష్టాన్ని, నష్టాన్ని మాత్రమే ఇస్తోంది,”అని అతను చెప్పాడు. "మేము నాశనం అయ్యాము, కానీ సాహుకార్లు [అప్పులిచ్చేవారు] సంతోషంగా ఉన్నారు."
మేము మాట్లాడుతుండగా ముదురు ఆకుపచ్చ జాన్ డీర్ ట్రాక్టర్లు గ్రామ రహదారిపైకి దూసుకెళ్లాయి. స్థానిక దేవాలయం గోడలపై ఒడియాలో బిటి పత్తిని ప్రచారం చేస్తూ అతికించిన విత్తన కంపెనీ పోస్టర్లు ఉన్నాయి. ఆ పంటకు సేద్యం, విత్తే పరికరాలు గ్రామ కూడలి చుట్టూ ఉన్నాయి.








