“ఝారియాలో గత 4-5 నెలలుగా మాకు కరెంటు లేదు. మా అక్క, తమ్ముడు, నేను కలిసి చదువుకోవడానికి టార్చిలైట్ వాడతాం కానీ అది 30-45 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది, మళ్ళీ రీఛార్జి చేయాల్సి వస్తుంది.”
సంతాల్ ఆదివాసి సముదాయానికి చెందిన 13 ఏళ్ళ సోమ్వారీ బాస్కే భాటిన్ మాధ్యమిక పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని. ఆమె పాఠశాల విద్య పూర్తి చేయాలని దృఢంగా నిశ్చయించుకుంది. "నేను బాగా చదువుకోవాలి, ఇదే నాకున్న ఒకే ఒక కల," అని చెప్పింది బాస్కే.
జాదూగోరా బ్లాక్లోని ఝారియా గ్రామంలో 1000 మందికి పైగా జనాభా ఉంటారు. ఈ గ్రామం అక్షరాస్యత రేటు 59 శాతం, కానీ ఝార్ఖండ్ సగటు (66 శాతం) కన్నా ఇది తక్కువ. తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని ఈ ఝారియా గ్రామంలో ఒక్క ప్రాథమిక పాఠశాలే ఉన్నందున సోమ్వారీ తన ఇంటి నుండి 4 కి.మీ. దూరంలో గల మాధ్యమిక పాఠశాలకు వెళ్ళవలసి వస్తోంది.
ఈ విలేఖరి సమీపంలోని ఖరియా కోచా గ్రామానికి వెళ్ళినప్పుడు సబర్ భాషను హిందీలోకి అనువదించి చెప్పటానికి చిన్నారి సోమ్వారీ తానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ విలేఖరికి సహాయకురాలిగా తూర్పు సింగ్భూమ్లోని సబర్ సముదాయపు ప్రజలతో మాట్లాడేందుకు తోడ్పాటునందించింది. తన మాతృభాష అయిన సంతాలీగాక సోమ్వారీ సబర్, హో, హిందీ, బంగ్లా భాషలు మాట్లాడగలదు.







