“శనివారాలు నా భర్త మూడు సీసాల మద్యాన్ని కొనుక్కుంటాడు. ఒక్కో సీసా ఇంత పొడవుంటుంది,” అన్నది కనక తన చేతిని పొడుగ్గా సాచి చూపిస్తూ. “అతను రెండు మూడు రోజులు బాగా తాగి, ఆ సీసాలు ఖాళీ అయ్యాక పనికి వెళ్తాడు. తిండికి సరిపడా డబ్బులు ఎప్పటికి ఉండవు. నాకు నా బిడ్డకు అసలు కడుపునిండదు, మళ్ళీ నా భర్తకి ఇంకో సంతానం కావాలి. వద్దు, నాకీ బతుకు”, అన్నదామె నిరాశగా.
ఇరవైనాలుగేళ్ల వయసున్న కనక(పేరు మార్చబడింది) కురుంబ ఆదివాసి మహిళ. ఈమె గుడలూరు ఆదివాసి ఆసుపత్రిలో డాక్టర్ ను కలవడానికి వచ్చింది. ఉదగమండలం (ఊటీ) నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడలూరు పట్టణంలోని ఈ 50 పడకల ఆసుపత్రి, తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని గూడలూర్, పంతులూరు తాలూకాలలోని 12,000 పైగా ఆదివాసి జనాభాకు సేవలను అందిస్తుంది.
చిన్నగా కుదిమట్టంగా ఉండి, వెలసిపోయిన ఒక సింథటిక్ చీరను కట్టుకుని, కనక తన కూతురి కోసం ఇక్కడికి వచ్చింది. ఈ ఆసుపత్రికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామంలో ఒక రెగ్యులర్ హెల్త్ చెక్ అప్ లో, ఆశ్విని(ASHWINI- Association for Health Welfare in Nilgiris) సంస్థలోని ఒక హెల్త్ వర్కర్, కనక కూతురు 7.2 కిలోగ్రాములే ఉండడం చూసి హైరానా పడింది (రెండేళ్ల పిల్లల సరియైన బరువు 10-12 కిలోలు). ఆ బరువు వలన ఆ పిల్ల విపరీతమైన పౌష్టికాహార లోప పరిధిలోకి వచ్చింది. ఆ హెల్త్ వర్కర్ కనకతో, పాపను ఆసుపత్రిలో చూపించమని గట్టిగా చెప్పింది.
కనక ఇంటికి వచ్చే ఆదాయాన్ని గమనిస్తే, ఆ పాపలో పౌష్హితకత లోపించడం ఆశర్యం కలిగించే విషయమేమి కాదు. ఇరవైల వడిలో ఉన్న ఆమె భర్త, వారంలో కొన్ని రోజులు సమీపంలోని టీ, కాఫీ, అరటి, మిరియాల ఎస్టేటుల్లో దిన కూలీగా పని చేసి రోజుకు 300 రూపాయిలు సంపాదిస్తాడు. “అతను తిండికోసం నెలకు 500 రూపాయిలు ఇస్తాడు,” అన్నది కనక. “దానితో నేను మొత్తం కుటుంబానికి వండిపెట్టాలి.”
కనక, ఆమె భర్త, ఆమె భర్తకు అత్తా, మామ వరసయ్యే వారితో కలిసి ఉంటున్నారు. ఆ అత్త, మామ 50ల వడిలో ఉన్నారు, దినకూలీలుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు కుటుంబాలకు రెండు రేషన్ కార్డులు ఉన్నాయి. దీనితో వారికి ప్రతి నెల 70 కిలోల ఉచిత బియ్యం కాక, 2 కిలోల పప్పు, రెండు కిలోల చక్కర, రెండు కిలోల నూనె సబ్సిడీ ధరల్లో లభిస్తాయి. “కొన్నిసార్లు నా భర్త బియ్యాన్ని కూడా అమ్మి, వచ్చిన సొమ్ముతో మద్యాన్ని కొనుక్కుంటాడు.” అన్నది కనక. “కొన్నిరోజులు అసలు తినడానికి ఏమి ఉండదు.”











