దోమ తెర కట్టిన నులక మంచం మీద వెల్లకిలా పడుకుని కలతగా ఉన్న కెహెల్యా వాసవే నొప్పితో మూలుగుతున్నాడు. తండ్రి బాధను దగ్గరగా చూస్తున్న పద్దెనిమిదేళ్ల లీల అతడి కాళ్ళను నొక్కి కాసింత ఉపశమనాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఎడమ బుగ్గ మీద ఒక పుండుతో, ఆహారం తీసుకోవడానికి కుడి ముక్కులో ఒక ట్యూబుతో కెహెల్యా కొన్ని నెలలుగా అలా మంచం మీదే పడి ఉన్నాడు. “ఆయన అటూ ఇటూ తిరగలేడు. పుండు సలుపుతూ ఉంటుంది ” అని అతడి 42 ఏళ్ళ భార్య పెస్రీ చెప్పింది.
నలభై ఐదేళ్ల కెహెల్యాకు దవడ క్యాన్సరు (బుక్కల్ మ్యూకోసా) వచ్చింది. మహారాష్ట్ర వాయువ్య ప్రాంతంలోని నందుర్బర్ జిల్లా చించ్పడ క్రిస్టియన్ ఆసుపత్రి వైద్యులు ఈ ఏడాది జనవరి 21 న వ్యాధి నిర్థారణ చేశారు.
దేశంలో మార్చి 1 నుండి 45-59 ఏళ్ల వయసు వారికోసం ప్రారంభం అయిన రెండో దశ కోవిడ్-19 టీకా కార్యక్రమం మార్గదర్శకాల్లో 20 సహ సంబంధిత రోగాలను (comorbidities) ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చేర్చింది. కెహెల్యాకు వచ్చిన కాన్సరు అందులో ఒకటి. తొలుత అరవై ఏళ్ళు పైబడ్డ వారికీ, ఆ తర్వాత 45-60 ఏళ్ల వయసు వారికీ, అలాగే సహ సంబంధిత రోగాలు ఉన్నవారికీ టీకాలు వేస్తారని ఆ శాఖ మార్గదర్శకాలు చెప్పాయి (ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ళు పైబడిన వారందరికీ సహ సంబంధిత రోగాలతో నిమిత్తం లేకుండానే టీకాలు వేయడం మొదలయ్యింది).
వయసు వర్గీకరణాలూ, సహ సంబంధిత రోగాల జాబితాలు లేదా అర్హతల విస్తరణలు- ఇవేవీ కూడా కెహల్యా, అతడి భార్య పెస్రీలకు ఏ ప్రయోజనాన్నీ చేకూర్చలేదు. షెడ్యూల్డ్ తరగతిలోని భిల్ సమూహానికి చెందిన వాసవే కుటుంబం టీకాలను వేయించుకోలేకపోతోంది. అక్రని తాలూకాలోని వారి ఊరు కుంభరికి 20 కి.మీ దూరంలో ఉన్న ధడ్గావ్ గ్రామీణ ఆసుపత్రిలో టీకా కేంద్రం ఉంది. అదే వారికి సమీపంలో ఉన్న టీకా కేంద్రం. “మేము అక్కడికి నడిచి వెళ్లడం వినా వేరే మార్గం లేదు” చెప్పింది పెస్రీ.












