“నా దగ్గర సెల్ ఫోన్ లేదు, సర్కారోళ్ల దగ్గర నా పేరెట్లా రాయించుకోవాలి?” అని అడిగింది కుని తమలియా. ఆమె తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, అన్నారం గ్రామంలో ఇటుకబట్టీల్లో పనిచేస్తుంది. అమెని, పిల్లల్ని శ్రామిక్ రైలు ఎక్కించడానికి పేర్లు రిజిస్టర్ చేసే పనిమీద మేము అక్కడికి వచ్చామేమో అనుకుంది.
వలస కార్మికులు బయటికి ప్రయాణం చెయ్యాలంటే తెలంగాణ ప్రభుత్వపు వెబ్సైట్ లో వాళ్ల సెల్ ఫోన్ నంబర్ ని నమోదు చెయ్యాలి. ఒరిస్సాకి తిరిగి వచ్చే కార్మికులకి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నమోదుని తప్పనిసరి చేసింది.
ఆమె బాధగా కొడుకుల వైపు చూస్తూ “వీళ్ల ఆధార్ కార్డ్ లు కూడా ఊర్లో వదిలేసి వచ్చాను. వీళ్లని రైల్లో ఎక్కనిస్తారా?” అనడిగింది. భక్త, 15, జగన్నాథ్, 9, వీళ్ళిద్దరు ఆమె కొడుకులు. తన వయసు సుమారు 40 ఏళ్ళు ఉండొచ్చని కుని చెప్పింది. కానీ ఆధార్ కార్డ్ లో మాత్రం అమె వయసు 64 ఏళ్లని ఉంది. “ఈ కార్డ్ లో ఏముందో నాకు తెలీదు. వాళ్ళు ఏదో కంప్యూటర్ లో రాసుకున్నారు.” అంది.
నవంబర్ 2019 లో ఆమె ఇసుకబట్టీలో పనికి చేరింది. ఈ సంవత్సరం మే నెల కల్లా గడువు పూర్తయ్యి తిరిగి ఒరిస్సా వెళ్ళిపోవాల్సి ఉంది. కానీ లాక్డౌన్ వల్ల ఆ విధవరాలు, ఏమీ అర్థంకానీ అయోమయంలో పడిపోయింది. ఆమె ఇటుకపని మొదటిసారి చేస్తుంది. దెముహయాని లోని, బౌధ్ జిల్లా కంటమల్ బ్లాక్ నుండి ఆమె పిల్లల్తో కలిసి ట్రక్ లో గుమ్మడిదల మండలం, అన్నారం గ్రామానికి చేరుకుంది.
కుని పిల్లల్తో కలిసి అన్నారం వచ్చిన కొన్ని వారాలకి , 42 ఏళ్ల సుమిత్రా ప్రధాన్ కూడా ఒరిస్సా నుంచి అక్కడికి వచ్చింది. ఆమెతో పాటు ఆమె భర్త గోపాల్ రౌత్, 40 వాళ్ల ఐదుగురు పిల్లల్తో సహా వచ్చాడు. బలాంగిర్ టిట్లాఘర్ బ్లాక్ లోని, శగద్ఘట్ గ్రామం నుంచి వాళ్లు బట్టీలకి వచ్చారు. వాళ్ల పెద్దకొడుకు 20 ఏళ్ల రాజు కూడా అమ్మానాన్నలతో కలిసి పనిచేస్తాడు. వాళ్ళు ఇల్లొదిలి వచ్చేముందు ఇటుక కాంట్రాక్టర్ వాళ్ల ముగ్గురికీ కలిపి ఇక్కడ పని చెయ్యడానికి 75,000 రూపాయిలు ఇచ్చాడు.







