"నేను దానిని కర్రతో కొట్టాను, కానీ అది నాపైకి దూకి నా మెడని, చేతులని దాని పంజాతో గీరింది. నేను అడవికి నాలుగు కిలోమీటర్ల లోపల ఉన్నాను. నా బట్టలు రక్తంతో తడిసిపోయాయి. నేను ఇంటి వరకు నడవడానికి చాలా కష్టపడ్డాను.” ఆ చిరుతపులి దాడి నుండి కోలుకోవడానికి విశాల్రామ్ మార్కం ఆసుపత్రిలో తరువాతి రెండు వారాలు గడిపాడు. అయితే తన గేదెలు క్షేమంగా ఉన్నాయని తెలుసుకుని సంతోషించాడు. “చిరుతపులి నా కుక్కలపై కూడా దాడి చేసింది. అవి పారిపోయాయి, ”అని అతను చెప్పాడు.
దాడి 2015లో జరిగింది. ఈ దాడి జరగడానికి ముందు, ఆ తర్వాత కూడా వేటాడే జంతువులను చాలా దగ్గరగా చూశానని మార్కం ఇప్పుడు చెప్పి నవ్వుతున్నాడు. చత్తీస్గఢ్లోని జబర్రా అడవిలో, అతను తన గేదెలను మేపుతున్నప్పుడు, ఆకలితో ఉన్న చిరుతపులిలను మాత్రమే కాకుండా, పులులు, తోడేళ్ళు, నక్కలు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, అలాగే సాంబార్, చితాల్ జింకలు, ఇంకా శక్తివంతమైన బైసన్లను కూడా చూసే అవకాశం ఉంది. వేసవిలో, జంతువులు అడవిలో చిన్న నీటి గుంటల కోసం వెళ్ళినప్పుడు, ఆకలితో ఉన్న మాంసాహారులైన క్రూరమృగాలను ఎదుర్కొనే అవకాశాలు రెట్టింపు అవుతాయి.
“నా గేదెలు వాటంతట అవే అడవిలోకి వెళతాయి. అవి తిరిగి రాకపోయినప్పుడు మాత్రమే నేను వాటి కోసం వెతుకుతాను,” అని మార్కం చెప్పారు. "కొన్నిసార్లు నా పశువులు తెల్లవారుజామున 4 గంటల వరకు తిరిగి రావు. నేను రాత్రిపూట అడవిలో వాటి కోసం వెతకడానికి డబుల్ [స్ట్రెంగ్త్] టార్చ్ని ఉపయోగిస్తాను." చెప్పులు లేకుండా అడవిలోకి వెళ్ళినందుకు చర్మం మీద వచ్చిన మచ్చలను, పొక్కులను మాకు చూపించాడు.
స్వతంతంగా ఉండే అతని గేదెలు ప్రతిరోజూమేత కోసం ధామ్తరి జిల్లాలోని నగ్రి తహసీల్లోని జబర్రా గ్రామం పక్కన ఉన్న అడవిలో 9-10 కిలోమీటర్ల మేర తిరుగుతాయి. వేసవిలో, ఆహారం కోసం అవి రెట్టింపు దూరం ప్రయాణిస్తాయి. “అడవిపై ఇక ఎవరూ ఆధారపడలేరు; పశువులు ఆకలితో కూడా చనిపోవచ్చు, ”అని మార్కం చెప్పారు.









