'ప్రతి ఆత్మా చావును రుచి చూస్తుంది' అని ఆ శిలా ఫలకం మీద రాసి ఉంది. మన జాతకాలలో రాయని ఎన్నో సత్యాలు, న్యూ ఢిల్లీ లో అతిపెద్ద స్మశానవాటికలలో ఒకటైన జదీద్ అల్-ఎ ఇస్లాం కబరిస్థాన్ లోని చాలా సమాధుల శాసనాల పైన ఉంటాయి.
— كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ – ఖురాన్ నుండి వచ్చిన ఈ మాట ఈ ముస్లిం స్మశానవాటికలో అలుముకున్న దిగులుకు ప్రశాంతతనూ, బెంగానూ మిళితం చేసింది. మరో చనిపోయిన వ్యక్తితో అంబులెన్స్ వస్తుంది. వారి ప్రియతములు వెళ్ళిపోయినవారికి చివరి ప్రార్థనలు చేస్తారు. త్వరలో వ్యాన్ ఖాళీ అవుతుంది. ఒక సమాధి నిండిపోతుంది. ఆ తరవాత ఒక యంత్రం సమాధిని మట్టితో నింపుతుంది
బహదూర్ షా జాఫర్ మార్గ్ వద్ద ఉన్న హౌసింగ్ మీడియా సంస్థల భవనాల ప్రక్కనే ఉన్న ఈ స్మశానవాటికలో ఒక మారుమూల- - 62 ఏళ్ళ నిజాం అక్తర్, అక్కడే కూర్చుని, మరణించినవారి పేర్లను సమాధిపై వ్రాస్తాడు. ఇలా రాయడాన్ని మెహ్రాబ్ అని అంటాడతాను. తన పార్కాజా (కాలిగ్రాఫి బ్రష్) ను వేళ్ళ మధ్య సున్నితంగా పట్టుకొని, అతను ఒక నుక్తాను - ఉర్దూ భాషలో కొన్ని అక్షరాలపై చుక్కను -పెడతాడు. ఈ నుక్తా ఉర్దూ అక్షరాలకు ప్రత్యేకమైన ఉచ్చారణను ఇస్తుంది. ప్రస్తుతం అతను వ్రాస్తున్న పదం ‘దుర్దానా’, అది ఒక కోవిడ్ -19 బాధితుడి పేరు.
నిజానికి నిజాం పేర్లను పెయింటింగ్ చేస్తున్నాడు. ఇంకా వచనాన్ని చక్కని సంక్లిష్టమైన కాలిగ్రఫీలో సమాధి రాళ్లపై చిత్రీకరిస్తున్నాడు. తరువాత అతనితో పాటు పని చేసే వ్యక్తి ఆ శాసనం వెంట వచనాన్ని చెక్కడానికి సుత్తి, ఉలిని ఉపయోగిస్తాడు. అతను అలా చేస్తున్నప్పుడు రాతి మీద పెయింట్ నెమ్మదిగా అదృశ్యమవుతుంది.
కతీబ్ (లేఖకుడు లేదా కాలిగ్రాఫర్) అనే నిజామ్, మరణించిన వారి పేర్లను సమాధిపై 40 ఏళ్లుగా ముద్రిస్తున్నాడు. "నేను ఇప్పటివరకు పనిచేసిన సమాధుల సంఖ్య మొత్తం నాకు గుర్తులేదు" అని అతను చెప్పాడు. “ఈ ఏప్రిల్, మే నెలల్లో, నేను కోవిడ్తో మరణించిన 150 మంది వ్యక్తుల పేర్లను కాక వేరే కారణాలతో చనిపోయినవారి ఇంకో 150 మంది పేర్లు కూడా వ్రాశాను. నేను రోజుకు మూడు నుండి ఐదు రాళ్లను పూర్తి చేస్తాను. ఒక రాయికి ఒక వైపు రాయడానికి ఒక గంట సమయం పడుతుంది,” అని అతను చెప్పాడు. రాయికి ఒకవైపు ఉర్దూలో రాస్తే రెండో వైపు ఇంగ్లిష్ లో రాస్తారు. “ఇది పెన్నుతో పేజీలు నింపే పనివంటిది కాదు" అని చిరునవ్వు నవ్వి, నోట్స్ రాసుకొంటున్న నన్ను చూసి సున్నితంగా వెక్కిరించాడు.













