చుట్టుపక్కల చూస్తూవుంటే, ఒకప్పుడు తాను యువకుడిగా చదువుకున్న హాలును ధ్వంసం చేసి నేలమట్టం చేసినట్లు ఆ 70 ఏళ్ల వృద్ధుడికి స్పష్టమవుతూ ఉంది. ఎక్కడ చూసినా నల్లబడిపోయిన కాగితాలు, పూర్తిగా కాలిన, సగం కాలిన పుస్తకాల బూడిద కుప్పలే ఉన్నాయి. పాఠశాల ఉన్న రోజుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు చదివిన, పరిశోధన చేసిన గ్రంథాలయపు గోడలు నల్లగా పొగచూరి, పగుళ్ళిచ్చాయి. కాలిన పుస్తకాల వాసన ఇంకా గాలిలో తేలియాడుతూనే ఉంది. పుస్తకాలను ఉంచిన పురాతనకాలపు చెక్క అలమారాలు బూడిదగా మారాయి.
ఈ 113 ఏళ్ళ వయసున్న మదరసా అజీజియాలో దాదాపు 4,500 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో 300 పుస్తకాలు ఇస్లామ్ మత పవిత్ర గ్రంథాలైన ఖురాన్,హదీసుల రాతప్రతులు. పాఠశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ షకీర్ ఖస్మీ మాట్లాడుతూ, “ఒక అల్మారాలో 250 కల్మీ (చేతితో రాసిన) పుస్తకాలు ఉన్నాయి. వాటిలో తత్వశాస్త్రం, వక్తృత్వం, వైద్యానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఇవి కాకుండా, 1910 సంవత్సరం నుండి ఇప్పటివరకూ చదువుతున్న విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్లు, మార్కు షీట్లు, సర్టిఫికేట్లు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి.
ఆ దురదృష్టకరమైన రోజును గుర్తు చేసుకుంటూ ఖస్మీ ఇలా అంటారు, “నేను సిటీ ప్యాలెస్ హోటల్ దగ్గరికి చేరుకునేసరికి, నగరంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉండటాన్ని గమనించాను.. ఎక్కడ చూసినా పొగ మాత్రమే కనిపించింది. (రాజకీయ) పరిస్థితులు మనం నగరంలోకి ప్రవేశించటానికి వీలుగా లేవు."
ప్రిన్సిపాల్ మరుసటి రోజు ఉదయానికి మాత్రమే మదరసాలోకి ప్రవేశించగలిగారు. దాదాపు 3 లక్షల మంది జనాభా ఉన్న నగరం మొత్తం మీద విద్యుత్ లేదు. “నేను తెల్లవారుజామున నాలుగు గంటలకు ఒంటరిగా వచ్చాను. నా మొబైల్ టార్చ్ వెలుగులో గ్రంథాలయం వైపు చూసి నేను మ్రాన్పడిపోయాను. నన్ను నేను కూడగట్టుకునే శక్తి కూడా లేకుండాపోయింది.”