అగ్రవర్ణ యువకుడొకడు, బాజ్రా (సజ్జ) పొలాల్లో భన్వారీ దేవి 13 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసినప్పుడు, ఆమె ఒక లాఠీ పట్టుకుని స్వయంగా తానే ఆ బలాత్కారం చేసినవాడిని వెతుక్కుంటూ వెళ్ళింది. పోలీసుల మీద, న్యాయస్థానాల మీద ఆమెకి నమ్మకం లేదు. కాని ఈ విధంగా కూడా, అహిరోఁ కా రామ్పురాలోని పెత్తందారీ కులాలవాళ్ళు ఆమెకి పరిహారం దక్కనివ్వలేదు. “మా గ్రామ కుల పంచాయతీవారు నాకు న్యాయం చేస్తానని మాటిచ్చారు. కాని రామ్పురా నుంచి నన్నూ నా కుటుంబాన్నీ బయటికి గెంటేసారు,” అన్నారామె. అజ్మేర్ జిల్లాకి చెందిన ఈ పల్లెటూరిలో ఈ అత్యాచారం జరిగి సుమారు ఒక దశాబ్దం అవుతున్నా, ఇంకా ఇక్కడ ఎవరికీ శిక్ష పడలేదు.
కాని రాజస్థాన్కి ఇది కొత్తేమీ కాదు. ఈ రాష్ట్రంలో ప్రతి 60 గంటలకి సగటున ఒక దళిత మహిళ అత్యాచారానికి గురవుతోంది.
షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ నివేదిక సమాచారం ప్రకారం, 1991 నుంచి 1996 వరకు దళిత మహిళలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించిన దాదాపు 900 దావాలు పోలీసుల వద్ద నమోదయ్యాయి. అంటే ఏడాదికి ఇంచుమించు 150 దావాలు - లేదా 60 గంటలకి ఒకటి. (కొన్ని నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించినప్పుడు తప్ప, ఆ సమయంలో ఈ రాష్ట్రం పూర్తిగా భారతీయ జనతా పార్టీ అధీనంలో ఉంది.) ఈ అంకెలు వాస్తవాన్ని కొలవలేవు. ఇటువంటి నేరాలు చాలా మటుకు వెలుగులోకి రాకుండా ఉండిపోయే హీన పరిస్థితి, దేశంలో అన్ని రాష్ట్రాలలో కన్నా కూడా ఈ రాష్ట్రంలోనే మరీ ఎక్కువ.
ధోల్పుర్ జిల్లా నక్సోడాలో, అతి దారుణమైన అత్యాచారానికి గురైన ఒక బాధితుడు ఆ గ్రామం నుంచి పారిపోయారు. ఏప్రిల్ 1998లో, రామేశ్వర్ జాటవ్ అనే ఒక దళితుడు, పెద్దకులానికి చెందిన ఒక గుజ్జర్కి ఇచ్చిన 150 రూపాయల అప్పుని తిరిగి అడుగుదామని అనుకున్నారు. కాని అది కొరివితో తల గోక్కున్నట్టు అయింది. అతని పొగరుకి విపరీతమైన కోపం వచ్చిన గుజ్జర్ల సమూహం, అతని ముక్కు దూలానికి రంధ్రం చేసి, ఒక మీటర్ పొడుగు, 2 మిల్లీమీటర్ల మందం ఉన్న జనపనార దారాలు రెండు తీసుకుని ఉంగరంగా చుట్టి, అతని ముక్కు పుటాలలోకి దూర్చారు. దాన్ని పట్టుకుని అతన్ని ఆ ఊరంతా తిప్పుతూ ఊరేగించారు.
ఈ ఘటన పత్రికలలో పడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. విదేశాల్లో కూడా పత్రికలలోనూ, టీవీ ద్వారా ఈ వార్త విస్తృతంగా ప్రచారమైంది. ఇంత ప్రాచుర్యం పొందినా కూడా, న్యాయం దక్కే విషయంలో ఏం లాభం లేకపోయింది. దీని వెనక, గ్రామంలో హడలు పుట్టించే పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో ప్రతికూలంగా పనిచేసే అధికార వర్గాల హస్తం ఉంది. సంచలన వార్తలు, అద్భుతమైన దృశ్యాలు, అన్నీ పక్కకు తప్పుకున్నాక, విలేఖరులకు ఈ దావా మీద ఆసక్తి పోయింది. మానవ హక్కుల సంఘాలు కూడా ఆ దారే పట్టినట్టున్నాయి. జరిగిన ప్రచారం వలన కలిగిన పరిణామాలను బాధితులే ఎదుర్కోవలసి వచ్చింది. రామేశ్వర్, న్యాయస్థానంలో తన మాటను మొత్తానికే మార్చేశారు. అవును, అత్యాచారం జరిగింది. కానీ అది చేసింది అతను నమోదు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న ఆరుగురు మాత్రం కాదు. దోషిని అతను గుర్తుపట్టలేకపోయారు.
ఎంతో వివరంగా అతని గాయాలను నమోదు చేసిన ఉన్నత వైద్యాధికారి కూడా ఇప్పుడు తనకు అవేమీ గుర్తులేనట్టుగా విజ్ఞప్తి చేసారు. అవును, ఆ గాయాలతో రామేశ్వర్ అతని దగ్గరకి వచ్చింది నిజమే. కాని అంతటి అసాధారణమైన గాయాలు తనకు ఎలా తగిలాయో బాధితుడు తనతో చెప్పారో లేదో ఆ వైద్యాధికారికి గుర్తులేదు.






