"ఏక్ మినిట్ భీ లేట్ నహీ హో సక్తే వర్నా హమారీ క్లాస్ లగ్ జాయేగీ" [“నేను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేను, లేదంటే నేను ఇరుక్కుపోయానే”] లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మహానగర్ పబ్లిక్ ఇంటర్ కాలేజ్ వైపు హడావిడిగా అడుగులు వేస్తూ చెప్పారు, రీతా బాజ్పాయ్. అది ఆమె విధులు నిర్వహించాల్సిన పోలింగ్ స్టేషన్ - అయితే అది ఆమె తన ఓటు వేయాల్సిన చోటు మాత్రం కాదు.
ఆ కాలేజీ ఆమె ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. డిజిటల్ థర్మామీటర్, శానిటైజర్ సీసాలు, వేదిక వద్ద పంపిణీ చేయడానికి అనేక జతల వాడిపారేసే చేతితొడుగులు, మాస్క్లతో నిండివున్నపెద్ద బ్యాగ్ని మోసుకుంటూ ఉదయం 5:30 గంటల వేళ ఆమె ఆ దూరం నడుస్తున్నారు. ఫిబ్రవరి 23న ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది జిల్లాల్లోని 58 ఇతర నియోజకవర్గాలతో పాటుగా లక్నోలో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న ఆ రోజు, ప్రత్యేకించి ఆమెకు పనిలో తలమునకలయ్యే రోజు.
ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి - ఫలితాలు కూడా వచ్చేశాయి. కానీ ఒక చాలా పెద్ద స్త్రీల సమూహానికి ఇంకా ఫలితాలు వస్తూండవచ్చు-అవి చాలా బాధాకరమైనవి, బహుశా ప్రాణాంతకమైనవి కూడా కావచ్చని వారికి తెలుసు. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో వారు బలవంతంగా ఎదుర్కోవాల్సి వచ్చిన కష్టాల నుండి ఉత్పన్నమయ్యే ఫలితాలవి.
వారు 163,407 మంది ఆశాలు (ASHA: అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్లు)! అధికారికంగా ఎటువంటి వ్రాతపూర్వక ఆదేశాలు లేకుండా వారు పోలింగ్ బూత్లలో పనిచేయవలసి వచ్చింది. మరీ ఘోరమైన విషయమేమంటే, పోలింగ్ కేంద్రాల వద్ద, అతి తక్కువ భద్రతా పరిమాణాలున్న పరిస్థితులలో, వారు పరిశుభ్రతనూ, పారిశుద్ధ్యాన్నీ నిర్వహించడం! అది కూడా, 2021 ఏప్రిల్-మే నెలలలో దాదాపు 2,000 మంది పాఠశాల ఉపాధ్యాయుల కోవిడ్-19 సంబంధిత మరణాలను చూసిన రాష్ట్రంలో! కోవిడ్-19 ఉధృతంగా ఉన్న ఆ సంవత్సరం ఏప్రిల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ అధికారులుగా ఉపాధ్యాయులు - వారి ఇష్టానికి వ్యతిరేకంగా - పని చేయాలని ఆదేశించబడ్డారు.










