రాత్రి రెండు గంటల సమయం. చిమ్మ చీకటి. అయినా తెల్లారే దాకా అతడు వేచి ఉండలేడు. మరో మూడు గంటలు ఆగితే తెల్లవారుతుంది. ఇంకప్పుడు బయలుదేరలేడు. పోలీసులు అక్కడకు వచ్చి అతడిని సముద్రంలోకి వెళ్లకుండా నిలువరిస్తారు. పోలీసుల లాక్ డౌన్ పహరా మొదలవుతుంది. అందుకనే వారు లేని ఆవేళ కాసరపు ధనరాజు, తోటి మత్స్యకారులు మరో ఇద్దరూ మెల్లగా సముద్రంలోకి జారుకున్నారు.
“మొదట్లో అలా వెళ్లడానికి నాకు చాలా భయం వేసేది. నేను ఎక్కడలేని ధైర్యాన్ని కూడదీసుకోవాల్సి వచ్చేది. నాకు డబ్బు కావాలి. అద్దె కట్టుకోవాలి” అన్నాడు నలభై ఏళ్ల ధనరాజు ఏప్రిల్ 10 న తాను చేసిన మొదటి సాహస కార్యాన్ని వర్ణిస్తూ. అతడు, అతడి ఇద్దరి స్నేహితులు తప్పని పరిస్థితుల్లో ఔట్ బోర్డు మోటారు లేని చిన్న పడవ మీద ఎవరి కళ్ళా పడకుండా సముద్రంలోకి జారుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో చేపల వేటనూ, ఇతర రేవు కార్యకలాపాలను నిషేధించారు. పోలీసులు ప్రతిరోజూ ఉదయం 5 గం. కల్లా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ రెండు ప్రధాన ద్వారాల వద్దకు చేరుకుంటారు. మత్సకారులకు, ప్రజలకు ఎవరికీ కూడా ఇక్కడి చేపల బజారులోకి అనుమతి లేదు.
తెల్లవారే సరికల్లా ధనరాజు వేటను పూర్తి చేసుకుని ఆరేడు కిలోల బంగారు తీగ చేపలతో వెనక్కి వచ్చేశాడు. “వెంట్రుక వాసిలో నాకు ప్రమాదం తప్పింది. నేను తీరం చేరిన కొద్ది క్షణాలలోనే పోలీసులు వచ్చేశారు. వాళ్ళు గనుక నన్ను పట్టుకుని ఉంటే బాగా కొట్టేవారు. కష్టాల్లో మనుగడ కోసం కొన్ని సార్లు తెగించక తప్పదు. నేను అద్దెను చెల్లించేస్తాను సరే, కానీ రేపు మరో అవసరం ఏదో మీద పడుతుంది. నాకు కోవిడ్ రాలేదు, కానీ దాని ప్రభావం నా మీద ఆర్థికంగా బాగానే పడింది” అన్నాడు ధనరాజు.
ధనరాజు పోలీసుల కళ్ల పడకుండా రహస్యంగా చేపల అమ్మకం సాగించాడు. బీచ్ రోడ్ లోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక ఉన్న చెంగల్రావు పేట ఇరుకు రోడ్డులో తన పాత రోమా సైకిల్ మీద తిరిగి చేపలు అమ్మేశాడు. సైకిలు మీద తెల్లని చెక్కను ఒక దాన్ని ఉంచి దాని మీద చేపలు పెట్టుకుని అమ్మకాన్ని సాగించాడు. “ సైకిలును మెయిను రోడ్డు మీదకు తీసుకుపోయి చేపలు అమ్ముకోవాలని అనుకున్నాను, కానీ పోలీసులకు భయపడ్డాను” అన్నాడు ధనరాజు. మామూలు రోజుల్లో అయితే కిలో రూ. 250 కి అమ్ముకోవాల్సిన చేపలను రూ. 100 కే అమ్ముకున్నాడు ధనరాజు.
సాధారణ పరిస్థితులలో అయితే ధనరాజు ఆ ఆరేడు కిలోల చేపల మీదా రూ. 1500 నుంచి రూ 1750 దాకా సంపాదించేవాడు. అతడి సైకిలు దుకాణం ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రెండు రోజులు తిరిగి అమ్మితే అతడికి కేవలం రూ. 750 దక్కాయి. 46 ఏళ్ల పప్పు దేవి అతడికి సాయంగా వచ్చేది. చేపల కొనుగోలుదారులకు వాటిని శుభ్రం చేసి ముక్కలు చేసి ఇచ్చేది. ప్రతి కొనుగోలుదారు నుంచి ఆమెకు రూ. 10-20 దక్కేవి. డబ్బు కోసం ఈమె కూడా ప్రమాదాన్ని ఎదుర్కొంది.










