తాను సైన్యంలో చేరాలనుకుంటున్నానని తండ్రితో చెప్పేనాటికి సూరజ్ జట్టి వయసు ఇంకా పదమూడేళ్ళ లోపే. విశ్రాంత సైనికుడైన అతని తండ్రి శంకర్, తన కొడుకు తనను స్ఫూర్తిగా తీసుకున్నందుకు పొంగిపోయారు.
"నా ఇంటి వాతావరణం కారణంగా ఇది నా ఖచ్చితమైన ఎంపిక అయింది," మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా, పలుస్ నగరంలోని ఒక అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న 19 ఏళ్ళ సూరజ్ అన్నాడు. "నాకు గుర్తున్నప్పటి నుండి ఇంక వేరే దేని గురించీ నేను ఆలోచించలేదు." కొడుకు నిర్ణయం పట్ల శంకర్ సంతోషించారు. ఏ తండ్రి అయినా చాలా సంతోషంగా ఆమోదం తెలుపగలిగే విషయమిది.
ఒక దశాబ్దం లోపే, తన కొడుకు ఎంపిక గురించి శంకర్కు సందేహాలు మొదలయ్యాయి. ఉద్వేగభరితుడై, గర్వించే తండ్రిగా ఉండే ఆయన ఈ కొన్ని సంవత్సరాల్లో ఎక్కడో విశ్వాసాన్ని కోల్పోయారు. సరిగ్గా చెప్పాలంటే జూన్ 14, 2022న.
ఆ రోజునే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, “అగ్నిపథ్ పథకం కింద, దేశ యువకులకు అగ్నివీర్గా సాయుధ దళాలలో సేవ చేసే అవకాశం కల్పించబడుతుంది," అని ప్రకటించాడు.
ఈ పథకాన్ని తీసుకురావడానికి ముందు, 2015-2020 మధ్య ఐదేళ్ళలో సాయధ దళాలలోకి చేరినవారి సగటు సంఖ్య 61,000గా ఉంది. 2020లో కోవిడ్ విలయం వలన నియామకాలు ఆగిపోయాయి.
అగ్నిపథ్ పథకం ద్వారా భారత సైన్యంలోకి తక్కువమంది - సుమారు 46,000 మంది యువకులను లేదా అగ్నివీరులను "మరింత చిన్నవయసు, మరింత అర్హులైన, వైవిధ్యమైన" దళం కోసం తీసుకుంటారు. ప్రభుత్వ పత్రికా ప్రకటన ప్రకారం, బలగాల సగటు వయస్సును 4-5 సంవత్సరాలు తగ్గించి, నమోదు చేసుకునే వయస్సు అర్హతను 17.5 నుండి 21 సంవత్సరాల మధ్యగా నిర్ణయించారు.
జీవితకాల సైనిక ఉద్యోగంలా కాకుండా, ఇది నాలుగు సంవత్సరాల ఒప్పందం. ఇది ముగిసే సమయంలో, ఆ జట్టులోని 25 శాతం మందికి సాయుధ దళాల సాధారణ శ్రేణిలో ఉద్యోగం లభిస్తుంది.










