పచ్చని లోయల మీదుగా పొగమంచు కమ్ముకుని, ఎర్రమట్టి కొండల గుండా గలగలలాడే సెలయేళ్ళు పారే వయనాడు వాలు ప్రాంతంలో, మట్టితో కట్టిన ఒక ఇల్లు కాలానికి ఎదురొడ్డి మొండిగా నిలబడి ఉంది. దాని మట్టి గోడలు వేసవిలో చల్లని గాలిని అందిస్తాయి, దాని వెదురు వాసాలు గాలికి మృదువుగా కిర్రుమంటాయి, బరువైన జిట్రేగు (రోజ్వుడ్) దూలాలు 150 వర్షాకాలాల భారాన్ని మోస్తున్నాయి. ఎర్రమట్టితో అలికివున్న నేలను ప్రతి వారం ఆవు పేడతో నునుపు చేస్తారు.
కేరళలోని మానందవాడి పట్టణానికి సమీపంలో ఉన్న కమ్మన గ్రామంలోని ఈ ఇల్లే, వరి విత్తనాలు తమ కథలను గుసగుసగా చెప్పే చోటు.
వీటి సంరక్షకుడు కురిచ్యా సముదాయానికి (రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా జాబితా అయివుంది) చెందిన చెరువయల్ రామన్. ఆయన సముదాయం ఒకప్పుడు వరి సాగులో తమ నైపుణ్యానికి గాను మలబార్ అంతటా ప్రసిద్ధి చెందింది. 73 ఏళ్ళ ఈయన దశాబ్దాల తరబడి పీడిస్తోన్నఆర్థిక ఇబ్బందులు, క్షీణిస్తున్న ఆరోగ్యం, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర సంస్థల నిర్లక్ష్యం ఉన్నప్పటికీ, సంప్రదాయ విత్తనాలను పరిరక్షించారు.
"అవి [విత్తనాలు] జీవించి ఉన్న పూర్వీకులు," అందరూ ప్రేమగా, గౌరవంగా రామేటన్ అని పిలుచుకునే రామన్ అంటారు. ఒకప్పుడు ఇంటి సంపదను దాని ధాన్యాగారంలో నిల్వచేసిన వరి రకాలతో కొలిచిన కేరళ వ్యవసాయ సంస్కృతికి సంరక్షకుడిగా ఆయన ప్రసిద్ధికెక్కారు.
రామన్ తన పూర్వీకుల కమతాన్ని వైవిధ్యానికి సజీవ నిలయంగా మార్చారు. అతని ధాన్యాగారంలో వయనాడుకు చెందిన 50 సంప్రదాయ రకాలతో పాటు, కేరళలోని ఇతర ప్రాంతాల నుండి సేకరించిన మరో 14 రకాలు ఉన్నాయి. అతను ప్రతి పంటకాలంలో వాటిని పండిస్తారు, విత్తనాలను దాచిపెడతారు. సాంప్రదాయక వ్యవసాయానికి కట్టుబడి ఉన్న ఎవరితోనైనా - ఆదివాసీ రైతులు, వ్యక్తిగత పెంపకందారులు, పరిశోధకులు, సంస్థలు - వాటిని ఉచితంగా పంచుకుంటారు. "ప్రతి బియ్యానికీ ఒక ఆత్మ ఉంటుంది," అన్నారాయన. "అది నేలను, వర్షాన్ని, తరాల స్పర్శను గుర్తుంచుకుంటుంది. దాన్ని కోల్పోతే, మీరు మీ చరిత్రను కోల్పోయినట్టే."
అతని ముందు గదిలోని మసక వెలుతురులో, అరుదైన వరి రకాలు నింపిన గోనె సంచులు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తూ ఒకదానిపై ఒకటి పేర్చి ఉన్నాయి. ప్రతి సంచికి మలయాళ జోలపాటల్లా ధ్వనించే పేర్లు రాసివున్న ట్యాగ్లు తగిలించి ఉన్నాయి: చెన్నల్లు, తొండి, చెంబగం, వెళియన్, గంధకశాల, కయమ.
ఆవిర్లు చిమ్మే గంధకశాల బియ్యం సువాసన మల్లెపువ్వు, చందనంను గుర్తుకు తెచ్చే పరిమళంతో గాలిని నింపుతుందని; జీరకశాల అని కూడా పిలిచే కయమ, మలబార్ బిర్యానీ సంప్రదాయాన్ని నిర్వచించే వెన్నవంటి సువాసనను గాలిలోకి వెదజల్లుతుందని; చెంబగం తీయని, సున్నితమైన సుగంధాన్ని కలిగి ఉంటుందని, దానిని తీపి వంటకమైన పాయసంగా చేసినప్పుడు కొబ్బరి పాలలో ఇట్టే కరగిపోతుందని రామన్ PARIకి వివరించారు.










