తిర్రా కళాకారుడైన ఎం.కె. కేళుకుట్టి ఒకసారి ఒక దివ్యారామంలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఒక చెట్టు నుండి ఒక ఆకును కోసుకున్నారు. "ఆ ప్రదేశాన్ని 'కలుషితం' చేసినందుకు అతన్ని నాలుగు అణాలు చెల్లించమని అడిగారు. ఇది జరిగినప్పుడు ఆయన ఒక దేవుడిగా ప్రదర్శన ఇస్తున్నారనే పట్టింపేమీ లేదు," ఆయన మనవడు ఎం.కె. కుంజిరామన్ గుర్తుచేసుకున్నారు.
తిర్రా కళాకారులు షెడ్యూల్డ్ కుల సముదాయాలకు చెందినవారు. ఆధిపత్య కులాలవారి దేవాలయాలలోకి ప్రదర్శనకారులుగా వీరు స్వాగతించబడినప్పటికీ, ఈ ప్రదేశాలు వారికి నిషేధించబడ్డాయి. ఈ ఉత్సవ నృత్యాన్ని కావు లేదా దివ్యారామాలలోనూ, అలాగే ఆలయ ప్రాంగణాలలోనూ ప్రదర్శిస్తారు. కానీ దేవత కొలువైన చోట ప్రవేశించడం, ప్రదర్శించడమనేది హద్దులు మీరటమే అవుతుంది.
కుంజిరామన్ వణ్ణన్ సముదాయానికి చెందినవారు. సాంప్రదాయికంగా బట్టలు ఉతికే వీరు, సాధారణంగా ఆధిపత్య కులాలకు చెందినవారి బట్టలు ఉతుకుతారు. వీరిని కేరళలో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేశారు. తిర్రా కళాకారులైన తన తండ్రి, తాతలతో కలిసి వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు అతను చాలా చిన్న పిల్లవాడు. చివరకు ఆయన తన తొలి నలభైల వయసులో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.
"తలచ్చిలన్, కరియాతన్, కుట్టిచాతన్, వేట్టకిరుమగన్, కణ్ణిగకరువాన్..." 87 ఏళ్ళ ఆ వృద్ధుడు తాను ధరించిన హిందూ దేవతల పాత్రలను నెమరువేసుకున్నారు.
ఆ తర్వాత కుంజిరామన్ 'అంజడి', 'తోట్టమ్ పాట్టు'లను పాడటం మొదలుపెట్టారు. మొదటిది నర్తకుడి శరీరాన్ని ఆవహించిన దేవుడిని ప్రార్థించేందుకు పాడేది, రెండవది కుట్టిచాతన్ చరిత్రను వివరిస్తుంది. తోట్టమ్ పాట్టును కుట్టిచాతన్ దేవిని కాకుండా, రక్షణనూ శ్రేయస్సునూ కోరుతూ పూజించే భగవతీ దేవిని ప్రార్థిస్తూ పాడతారని కొంతమంది పండితులు చెబుతారు. ఆయన తన ఛాతీపై ఎనిమిది పుళ్ళి(చుక్కలు)ను చిత్రీకరించుకున్నారు.
సంగీతభరితమైన ఆయన స్వరం ఆ ప్రదేశాన్ని నింపుతోంది. “కుట్టిచాతన్ ఒక వళ్ళువ [దిగువ కులం] తల్లికి, నంబూదిరి [బ్రాహ్మణ] తండ్రికి జన్మించాడు. అతను బాలుడిగా ఉండగా ఒకసారి అతనికి చాలా ఆకలిగా అనిపించింది. అతను చాలా కాలంగా ఆకలితో ఉన్నాడు. అప్పుడతను తన మందలోని ఒక గేదెను చంపి దాని రక్తాన్ని తాగాడు. ఉగ్రుడైన అతని తండ్రి అతన్ని చంపి అతని శరీరాన్ని 399 ముక్కలుగా నరికాడు,” అని కుంజిరామన్ వివరించారు.
ఆయన కోళిక్కోడులోని శివపురం గ్రామంలో ఉన్న తన రెండంతస్తుల ఇంటి వరండాలో కూర్చొని ఉన్నారు. "ఈ రోజున మనకు చాలామంది కుట్టిచాతన్లు ఉన్నారు - పూకుట్టి, తీకుట్టి, కరికుట్టి," అని ఆయన ఈ విలేకరితో చెప్పారు.


























