“ఒక గ్రామంలోకి రాయల్ బెంగాల్ పెద్దపులి ప్రవేశించినప్పుడు ఊరంతా గందరగోళం మొదలవుతుంది,” లుత్ఫొర్ మొల్లా చెప్పారు.
గ్రామంలోకి పులి ప్రవేశించిందన్న వార్త వ్యాపించగానే, దాన్ని తరిమికొట్టడానికి లుత్ఫొర్ తన బృందంతో కలిసి రంగంలోకి దిగుతారు. సుందర్బన్స్లోని (సుందరవనాలు) కుల్తొలీ బ్లాక్లో ఉన్న గ్రామాలన్నిటికీ కలిపి రాష్ట్ర అటవీ శాఖ రెండు ‘వేగంగా స్పందించే బృందాలను’ ఏర్పాటు చేసింది. గత నాలుగైదేళ్ళుగా, లుత్ఫొర్ ఒక బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
పులులను తరిమికొట్టే ఈ బృంద నాయకుడి గురించి తెలిసిన తరువాత, మొయిపిట్ తీరప్రాంత పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అతని స్వగ్రామమైన పూర్బా గుర్గురియాకు మేం బయలుదేరాం.
మిట్టపల్లాలుగా, తారు పూత లేని ఆ రోడ్డు ఎగుడుదిగుడుగా ఉన్న ఒక మట్టి రోడ్డుకు దారితీస్తోంది. మలుపులు తిరుగుతోన్న రోడ్డు పక్కనుంచి అగాధమైన మాత్లా నది నీరు నల్లగా ప్రవహిస్తోంది. మేం అరగంటసేపు నడిచినా, మాత్లాలో ఒక్క పడవ కూడా కనబడలేదు. నదికి అవతలి వైపున విస్తారమైన, దట్టమైన అడవి ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం, పూర్బా గుర్గురియాలో సుమారు 5,600 మంది నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది హిందువులే కానీ, ముస్లిములు కూడా గణనీయమైన సంఖ్యలో నివసిస్తున్నారు. భుబనేశ్వరి పంచాయతీ పరిధిలోని ఈ గ్రామవాసులు జీవనోపాధి కోసం చేపల వేట, వ్యవసాయంపై ఆధారపడ్డారు.
లుత్ఫొర్ నివసించే బాట్ తొలా ప్రాంతానికి చేరుకున్న తరువాత, అతని ఇంటి కోసం చుట్టుపక్కల విచారించాం. బాట్ తొలా పక్కనే ఉన్న కాళీ మందిరం ప్రాంగణంలో, సంచి నిండా పీతలతో ఒక యువప్రాయపు బాలుడు వేచి చూస్తూ కనబడ్డాడు. మమ్మల్ని చూడగానే, “కొల్కతా నుండి వస్తున్నారు కదా? నేను లుత్ఫొర్ మొల్లా పెద్ద కొడుకుని. మీ కోసమే ఎదురు చూస్తున్నాను,” అన్నాడు.
లుత్ఫొర్ ఇల్లు దగ్గర్లోనే ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద, దాదాపు 1,000 చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన ఒంటి అంతస్తు ఇల్లు అది. ఇటుకలతో కట్టిన మూడు గదులు, కాంక్రీట్ పైకప్పు, చిన్న వరండాతో నిరాడంబరంగా ఉంటుంది. అన్నిటికంటే పెద్దగా ఉన్న ఒక గదిలోకి మేం అడుగుపెట్టగానే, మంచం మీద జారగిలబడివున్న ఒక వ్యక్తి బలహీనమైన స్వరంతో పలకరించారు: “ఏం చెప్పమంటారు? గత కొన్ని రోజులుగా ఈ జ్వరం నన్ను పట్టి పీడిస్తోంది.” ఆయనే లుత్ఫొర్ మొల్లా. బలహీనంగా ఉన్న ఈ మనిషే!








