ప్రతి రచయిత తన రచనలు చదివే పాఠకుల కోసం వెతుక్కుంటారు.
ప్రపంచం చదవడానికి ముందే, దానిని మొదటిసారి వినే ఒక వ్యక్తి ఎప్పుడూ ఉంటారు. శ్రద్ధానంద్ అసుర్ విషయానికొస్తే, ఆ వ్యక్తి 18 సంవత్సరాలుగా మారనేలేదు.
"నేను దాన్ని అథనాస్కు చదివి వినిపిస్తాను," అంటారతను. "నా జీవితంలో నేను రాసిన మొదటి గీతమైన యేసు గీత్ను నేను అతని కోసమే రాశాను." అతను తన ప్రాణస్నేహితుడు, మొదటి శ్రోతా అయిన అథనాస్ వైపు చూశారు. కొన్ని క్షణాల తర్వాత ఆ స్నేహితులిద్దరూ బిగ్గరగా నవ్వటం మొదలెట్టారు.
శ్రద్ధానంద్, అథనాస్లిద్దరూ ఝార్ఖండ్లోని లుపూంగ్పాఠ్ గ్రామానికి చెందినవారు. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి నడుస్తూ బడికి వెళ్ళేవారు. ఒకరోజు, వారిద్దరూ కలిసి తమ రోమన్ కాథలిక్ ప్రాథమిక పాఠశాలకు వెళ్తుండగా, అథనాస్ చాలా ఒత్తిడిలో ఉన్న విషయాన్ని శ్రద్ధానంద్ గమనించాడు. "అప్పుడిక బడిలో ఒక పాట పాడటం అథనాస్ వంతు," అతను గుర్తుచేసుకున్నారు. అతను పాడే పాట, అతని వార్షిక పరీక్షల ఫలితాలను నిర్ణయించటంలో సహాయపడుతుంది.
ఈ స్నేహితులిద్దరూ ఝార్ఖండ్లో ప్రత్యేకించి హానికి గురవుతోన్న ఆదివాసీ తెగ (PVGT) అసుర్ సముదాయానికి చెందినవారు. అథనాస్కు పుట్టుక నుంచే ఎడమచేయి సరిగ్గా ఎదగలేదు. "అందరూ అతన్ని లూలా (కుంటివాడు) అనీ, ఠుఠా (చేతకానివాడు) అనీ పిలిచేవారు," ఈ మాటల్ని గుర్తు చేసుకున్నప్పుడు శ్రద్ధానంద్ ముఖంలో నవ్వు మాసిపోయింది.














