పలామూలోని చెయిన్పుర్ బ్లాక్లో ఉన్న కంకరీ గ్రామంలో ప్రస్తుతం నివసిస్తోన్న అతి కొద్దిమంది గొర్రెల కాపరులలో నందూ పాల్ ఒకరు. రాష్ట్రంలో ఆరు లక్షలకు పైగా గొర్రెలు [2019], 88 లక్షలకు పైగా జంతువులతో పాటు 11 మిలియన్ల పశుగణం ఉన్నప్పటికీ, దేశంలో మేకల కాపరులు ఉండే ప్రధాన రాష్ట్రాలలో ఝార్ఖండ్ ఒకటిగా గుర్తించబడింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ జంతువులన్నీ ఈ ప్రాంతంలోని ఉమ్మడి మేత స్థలాలను పంచుకుంటాయి.
“అప్పుడప్పుడు, మేం పచ్చిక బయళ్ళను వెతుక్కుంటూ 12–13 కోసుల [సుమారు 40 కిలోమీటర్లు] దూరం నడుస్తాం,” నందూ పాల్ దాయాది రామ్రతి(62) తెలిపారు. “గతంలో, దోహర్లలో మగర్ గడ్డి, బోదెల వంటివి పుష్కలంగా దొరికేవి. కానీ ఇప్పుడు అవి కూడా కనుమరుగయ్యాయి,” అన్నారాయన. మగర్ ఘాస్ అనేది ఈ ప్రాంతంలోని దోహర్ [సహజ నీటి వనరులు] చుట్టూ సమృద్ధిగా పెరిగే ఒక మందపాటి, గరుకైన గడ్డి రకం. దీన్ని తరచూ పశువులకు మేతగా ఉపయోగిస్తారు. తడి నేలలో మాత్రమే బాగా పెరిగే ఈ గడ్డి, ఈ ప్రాంతంలో నీటి వనరులు ఎండిపోవడంతో కనుమరుగైంది.
ఇదిలా ఉంటే, సాగుచేసే భూముల్లో కూడా జంతువులు నెమరువేయడానికి తగినంత ఆహారం కూదా దొరకడం లేదు. ఒకప్పుడు, చనా [శనగలు], చక్వడ్ [సెన్నా అబ్టుసిఫోలియా లేదా తగిరిస] లాంటి పంటలు పెరిగిన భూమిలో వాటి విత్తనాలు దొరికేవి. కానీ ఇప్పుడు, అవి పెద్దగా కనబడడం లేదు. ఎందుకంటే, కొంతమంది రైతులు మాత్రమే వాటిని పండిస్తున్నారు. ఆ పంటలకి బదులు, ఇప్పుడు చాలామంది రైతులు మొక్కజొన్న, వరి, గోధుమలు పండిస్తున్నారు. ఈ పంటల్లో, పశువుల మేతకు కావలసినదేదీ మిగలదు. “గతంలో లాగా, ఇప్పుడు గొర్రెలకు తగినంత పోషకాహారం దొరకడం లేదు. ఇప్పుడు, కనిపించేదంతా కొంత సవన్నా గడ్డి, కొంత డూబ్ గడ్డి [సైనొడాన్ డాక్టిలాన్ లేదా గరిక] మాత్రమే,” నందూ తెలిపారు.
వరుసగా రెండేళ్ళు [2022, 2023] కరువు రావడంతో, ఈ ప్రాంతంలోని నీటి వనరులన్నీ ఎండిపోయాయి. ఉన్న అరకొర కూడా ఇప్పుడు కలుషితమయ్యాయి. “గొర్రెలు బతకడానికి స్వచ్ఛమైన నీరు కావాలి,” గత దశాబ్ద కాలంలో అనేక నీటి వనరులు కనుమరుగవడం చూసిన నందూ చెప్పారు.
గత ఏడాది కరువు సమయంలో, “మేం చాలా కష్టకాలాన్ని చూశాం. రోజంతా మేసిన తరువాత కూడా గొర్రెల ఆకలి తీరేది కాదు,” నందూ బిగ్గరగా తెలిపారు. “గత ఏడాది [2023] నేను 20 గొర్రెలను పోగొట్టుకున్నాను,” కొంత విరామం తరువాత అన్నారాయన.
స్వచ్ఛమైన నీరు దొరకనప్పుడు జంతువులకు సోకే న్యూమోకోకల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు నందూ, ఆయన సహచరులు ఈ మధ్యనే తమ గొర్రెలకు టీకాలు వేయించారు.