రేషన్ పంపిణీ నుంచి మొదలుకొని, రాష్ట్ర నిధులను ఎలా వినియోగిస్తున్నారన్న వివరాలపై పారదర్శకత లేకపోవడం వరకు, అనేక సమస్యలపై గుజ్జర్ పశుపోషకుడైన అబ్దుల్ రషీద్ షేక్ ఆర్టిఐ (సమాచార హక్కు) పిటిషన్లను దాఖలు చేస్తున్నారు. ప్రతియేటా 50కి పైగా గొర్రెలు, సుమారు 20 మేకలు ఉన్న తన పశువుల మందతో కశ్మీర్లోని హిమాలయాలకు వెళ్ళే ఈ 50 ఏళ్ల పశువుల కాపరి, గత దశాబ్దంలో రెండు డజన్లకు పైగా సమాచార హక్కు పిటిషన్లను దాఖలు చేశారు.
"గతంలో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు తెలియదు, మా హక్కుల గురించి మాకూ అవగాహన ఉండేదికాదు," దూధ్పథరీలో తన కొఠా (మట్టి, రాయి, కలపతో కట్టిన సాంప్రదాయిక ఇల్లు) బయట నిలబడి ఉన్న అబ్దుల్ అన్నారు. ప్రతి వేసవిలో ఆయన, ఆయన కుటుంబం అక్కడికి వలస వస్తుంది. వాళ్లు బడ్గామ్ జిల్లా, ఖాన్సాహిబ్ బ్లాక్లోని స్వగ్రామం ముజ్పథరీ నుండి ఇక్కడికి వచ్చారు.
"ప్రజలకు చట్టాలు, తమ హక్కుల గురించి అవగాహన కల్పించడంలో ఆర్టిఐలను దాఖలు చేయడం చాలా పెద్ద పాత్రను పోషిస్తుంది; అధికారులతో ఎలా వ్యవహరించాలో కూడా మేం నేర్చుకున్నాం,” అని అబ్దుల్ అన్నారు. మొదట్లో అధికారులకే సమాచార హక్కు చట్టం గురించి తెలిసేదికాదు. "సంబంధిత పథకాలు, నిధుల పంపిణీ గురించి సమాచారం ఇవ్వమని అడిగినప్పుడు వాళ్లు తరచుగా ఆశ్చర్యపోయేవాళ్లు."
ఇలా అడగడం గ్రామంలోని ప్రజలను వేధింపులకు గురిచేయడానికి దారితీసింది - పోలీసులు బ్లాక్ అధికారులతో కుమ్మక్కై తప్పుడు ఎఫ్ఐఆర్లు (ప్రాథమిక సమాచార నివేదికలు) దాఖలు చేశారు. వాళ్లు సమాచార హక్కు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న అబ్దుల్లాంటి విషయాలు తెలిసిన పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు.
“అవినీతిపరులు అధికారులే. ఇప్పుడు వాళ్ల ఆస్తులను చూడండి,” అంటూ తన అభిప్రాయాన్ని గట్టిగా నొక్కిచెప్పే ప్రయత్నం చేశారు అబ్దుల్. ఆర్టిఐలను దాఖలు చేయడంతో పాటు, ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల (FCSCA విభాగం) నుంచి, ముజ్పథరీలోని సుమారు 50 మందికి రేషన్ కార్డులు జారీ చేయాలని కూడా అబ్దుల్ డిమాండ్ను లేవనెత్తారు.











