అతను విరాట్ కోహ్లిని పూజించేవాడు. ఆమె బాబర్ ఆజమ్ను ఆరాధించేది. కోహ్లి సెంచరీ చేసినప్పుడల్లా అతనామెకు చూపించేవాడు, బాబర్ బాగా ఆడినప్పుడు ఆమె అతణ్ని ఆట పట్టించేది. ఈ క్రికెట్ పరిహాసం ఆయేషా, నూరుల్ హసన్ల ప్రేమ భాష. కానీ వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళిద్దిరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుసుకుని తరచూ ఆశ్చర్యపోతుంటారు.
2023 జూన్లో ప్రకటించిన క్రికెట్ ప్రపంచ కప్ టైమ్ టేబుల్ను చూసి అయేషా కళ్ళు మెరిశాయి. అక్టోబరు 14న గుజరాత్లోని అహ్మదాబాద్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని దానిలో ఉంది. "మనం ఈ మ్యాచ్ను తప్పకుండా స్టేడియంలోనే చూడాలని నేను నూరుల్తో చెప్పాను," అని రాజాచే కుర్లే గ్రామంలో కూర్చొనివున్న 30 ఏళ్ళ ఆయేషా గుర్తు చేసుకుంది. పశ్చిమ మహారాష్ట్రలోని రాజాచే కుర్లే, ఆమె పుట్టిల్లు. "భారత్, పాకిస్థాన్లు చాలా అరుదుగా ద్వైపాక్షిక మ్యాచ్లు ఆడతాయి. అది మాకిష్టమైన ఆటగాళ్ళు ఇద్దరినీ కలిసి చూసే అరుదైన అవకాశం."
సివిల్ ఇంజనీర్ అయిన 30 ఏళ్ళ నూరుల్, కొన్ని ఫోన్ కాల్స్ చేసి, ఎలాగైతేనేం రెండు టిక్కెట్లు సంపాదించాడు. దాంతో ఆ జంట ఆనందానికి హద్దు లేదు. అప్పటికి ఆయేషా ఆరు నెలల గర్భవతి. దాంతో వాళ్ళు సాతారా జిల్లాలోని తమ గ్రామమైన పుసేసావళి నుంచి 750 కిలోమీటర్ల ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. రైలు టిక్కెట్లు బుక్ చేసి, బస ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది, కానీ ఆ జంట మాత్రం మ్యాచ్ను చూడలేకపోయింది.
అక్టోబరు 14, 2023న సూర్యోదయం అయ్యే సమయానికి, నూరుల్ మరణించి నెల రోజులయింది, ఆయేషా ఆ బాధలో కూరుకుపోయి ఉంది.








