గమనిక: PARI ఇప్పటికే వృద్ధుల గురించీ అంగవైకల్యాన్ని గురించీ అనేక కథనాలను వెలువరించింది. ఇప్పుడు ఆ అంశాలను ప్రత్యేక ఇతివృత్తాలుగా పరిగణించబోతున్నాం. అందులో ఇది మా మొదటి కథనం


Sangrur, Punjab
|WED, OCT 08, 2025
పంజాబ్లో: హరిత విప్లవపు రక్తపు పంట
గ్రామీణ పంజాబ్లో, వ్యవసాయ యంత్రాల వల్ల జరిగే ప్రమాదాలు సర్వసాధారణం, కానీ జీవనయానాలు మాత్రం సాగిపోతుంటాయి. అక్టోబర్ 1, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వయోజనుల దినోత్సవం సందర్భంగా వృద్ధాప్యం, అంగవైకల్యాలను గురించిన ఒక కథనం
Author
Editor
Photo Editor
Translator
కుడిచేయి తెగిపోయి దశాబ్దాలు గడుస్తున్నా, తనకు ఒక అవయవం లేదని ఒప్పుకోవడం ఇప్పటికీ సుర్జీత్ సింగ్కు నచ్చదు.
“గడ్డి కోయడం తప్ప అన్నీ చేయగలను – దానికి రెండు చేతులు కావాలి, ఒకటి దాన్ని పట్టుకోవడానికి, రెండోది కొడవలితో కొయ్యడానికి,” అన్నారా వృద్ధ రైతు. సంగ్రూర్ జిల్లాలోని రంగియాఁలో ఉన్న తన పది ఎకరాల పొలంలో, ప్రతిరోజూ తాను చేసే అనేకమైన పనులను లెక్కపెట్టి మరీ చెప్పడం మొదలుపెట్టారాయన..
అయితే ఆయన భార్య కుల్వంత్ కౌర్ కలగజేసుకుని ఆయన మాటల్ని నిర్మొహమాటంగా కొట్టిపడేశారు. “పైజామా బొందులే కట్టుకోలేడీయన,” అన్నారావిడ. “పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కనీసం సరిగ్గా శుభ్రమైనా చేసుకోలేడు. వీపు దురదపెడితే గోక్కోవడానికో చెయ్యే లేదని, వీపును రాపాడించడానికి గోడకేసో, చెట్టు కాండం వేపుకో పరిగెడతాడు.”
అయినప్పటికీ, అంగవైకల్యం ఉన్న పౌరులకు అందే సదుపాయాలన్నిటినీ పొందే అర్హతను ఆయన పొందలేకపోయారు. ఆయన పట్వారీ (భూముల రికార్డులను నిర్వహించే గ్రామస్థాయి అధికారి)ని కలిశారు. "కానీ, 'నీకు సొంతభూమి ఉంది కాబట్టి నువ్వు అనర్హుడివి,’ అన్నాడాయన. చేసేదిలేక ఇంటికి తిరిగి వచ్చాను.” చట్టం ప్రకారం భూస్వాములైనా భూమిలేనివారైనా ఇందుకు అర్హులే కాబట్టి, ఆ మాట అర్థంలేనిది. సుర్జీత్కు ఎటువంటి నష్టపరిహారంగానీ, పంజాబ్లో నెలకు రూ. 1500 చొప్పున అందే వికలాంగుల పింఛన్ గానీ అందలేదు. అంతేకాక, వృద్ధాప్య పింఛన్ కూడా - 60-69 సంవత్సరాల మధ్య వయసున్నవారికి రూ. 1500, 70 ఏళ్ళు దాటినవారికి రూ. 2000 - ఆయనకు అందడంలేదు.

Vishav Bharti

Vishav Bharti
72 ఏళ్ళ వయసున్న ఈయన, ఒంటిచేత్తో అంతులేని శ్రమ చేయగల తన సామర్థ్యం పట్ల తప్ప, గర్వించటానికి మరేదీ లేనట్లు ప్రశాంతంగా కనిపిస్తారు. ఇంతకీ ఆయన రెండో చేయి ఎలా పోయింది? 1990ల మధ్యలో, అంటూ చెప్పుకొచ్చారు సుర్జీత్. “నేను సులభంగా పరధ్యానంలో పడతానని మా అన్న నన్ను గడ్డి కోసే యంత్రంతో పని చెయ్యవద్దని చాలాసార్లు వారించేవాడు. ఆ రోజే మరమ్మత్తు చెసి తెచ్చిన ఆ టోకా (గడ్డి కోసే యంత్రం)తో చెరుకుపిప్పిని చిన్న చిన్న ముక్కల దాణాగా కత్తిరిస్తున్నాం. ముందుగా నా వేళ్ళు దాని రోలర్లలో ఇరుక్కుపోయి, తర్వాత నా చేతిని అందులోకి లాగేసింది. ఆ వెంటనే చేయంతా పోయింది,” అంటుండగానే ఎర్రబడ్డ ఆయన కళ్ళు నిర్వేదంగా మారాయి.
ఆయన ఆపగానే ఆయన భార్య, 65 ఏళ్ళ కుల్వంత్ కౌర్ అందుకున్నారు. “దాణా ముక్కలైనట్టే చెయ్యి కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది. నెత్తురు మడుగు కట్టింది. అదంతా చూసి నాకు స్పృహ తప్పింది.” సుర్జీత్ 20 రోజులపాటు ఆస్పత్రిలో గడిపారు. అయితే తీరికగా, జరిగినదాన్ని తలుచుకుంటూ విచారించేంత సమయం లేదాయనకి. బ్రతకాలంటే పని చేయక తప్పదు. నెలన్నర గడిచేసరికి ఆయన మళ్ళీ పొలంలోకి దిగారు. “వద్దంటున్నా వినకుండా ఒంటిచేత్తో బోరుబావిని సరిచెయ్యడానికి బావిలోకి దిగాడని పక్కింటివాళ్ళు చెప్తే మాకు తెలిసింది. చెయ్యి పోయినందుకు ఆయన దిగులుపడటం మాత్రం నేనెన్నడూ చూళ్ళేదు,” చెప్పారు కుల్వంత్.
“ఆయనకే గనక రెండు చేతులూ ఉంటేనా, ఈ గోడలను స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేసేవాడు. అంత కష్టపడే మనిషి ఆయన,” చెప్పారావిడ.
సుర్జీత్ సింగ్తో పాటు మరెందరో, 1970 దశకం మొదట్లో హరిత విప్లవం తెచ్చిన సాంకేతికతలూ యాంత్రికీకరణల వల్ల నెలకొన్న ఒక ప్రత్యేకమైన ‘పంట’కు ప్రతీకలవుతున్నారు. పంజాబ్లోని గ్రామాల్లో ఆయన గాథలను పోలిన వ్యథలెన్నో ఉన్నా, అవన్నీ నిశ్శబ్దంగా సమాధి అయ్యాయి.

Vishav Bharti
1975 నుంచి 1978 మధ్యకాలంలో ఒక్క పంజాబ్లోనే, యంత్రాలవల్ల 841 ప్రమాదాలు జరిగాయి.
పంజాబ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డ్ సంగ్రహం చేసిన డేటా ప్రకారం, 2007 నుంచి 2012 మధ్యన, వ్యవసాయక్షేత్రాల్లో జరిగిన ప్రమాదాల మొత్తం సంఖ్య 6,196. వీటిలో 4,218 – అంటే 68.08 శాతం - పశుగ్రాసాన్ని ముక్కలుగా కత్తిరించే యంత్రాల వల్లనే జరిగాయి. మరో 1,395 – అంటే 22.51 శాతం, కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాల వల్ల జరిగాయి. ఇక 583, అంటే 9.41 శాతం ట్రాక్టర్లు, వాటికి సంబంధించిన పరికరాల వల్ల జరిగాయి.
ప్రమాదాల డేటాని విశ్లేషిస్తూ మార్కెటింగ్ బోర్డ్ చేసిన అధ్యయనాన్ని – దీనిని చాలా కనిష్టమైన అంచనాగా అనుకోవచ్చు - చూస్తే, గడ్డిని కత్తిరించే యంత్రాలు, నూర్పిడి యంత్రాల వల్ల జరిగిన ప్రమాదాల్లో 67.5 శాతం కేసుల్లో వ్రేళ్ళను, 18.2 శాతం కేసుల్లో చేతులను, 10.5 శాతం కేసుల్లో పూర్తి చేతిని తొలగించవలసి వచ్చిందని తెలుస్తుంది.. వ్యవసాయ సంబంధిత ప్రమాదాల బాధితులకు అందవలసిన పరిహారాన్ని గురించి 2017లో చేసిన ఈ అధ్యయనం, లుథియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిఎయు)లోని వ్యవసాయ యంత్రాలు, విద్యుత్ ఇంజనీరింగ్ విభాగం నుంచి వచ్చింది..
అయితే, మార్కెటింగ్ బోర్డ్ డేటాను పిఎయు జరిపిన అధ్యయనం ప్రశ్నించడమే కాక 2007-12 మధ్యకాలంలో, ఒక్క మూడేళ్ళ వ్యవధిలోనే వ్యవసాయక్షేత్రాల్లో 9,188 ప్రమాదాలు జరిగాయని చెప్పింది. నష్టపరిహారంగా, 5,492 మందికి రూ. 25 కోట్లను అందజేశారు. అంటే, ఒక్కొక్కరికి సగటున రూ. 50,000 కంటే తక్కువ. కనీసం 3,696 మంది ప్రమాద బాధితులకు, లేదా మొత్తం 9,188 మందిలో 40 శాతానికి మించిన ప్రజలకు, ఏ పరిహారమూ అందలేదన్నది స్పష్టమౌతున్నది.
హరిత విప్లవంలో భాగంగా కొత్త రకాల యంత్రాలను ప్రవేశపెట్టిన వెంటనే ఈ ప్రమాదాలు మొదలయ్యాయి. వ్యవసాయ సంబంధిత ప్రమాదాల్లో అంగవైకల్యం ఏర్పడినవారు కనీసం ఒకరైనా కనిపించని గ్రామమేదీ పంజాబ్లో లేదు. విచారించవలసిన విషయమేమంటే, అంగవైకల్యం ఏర్పడిన తర్వాత, చాలామంది బాధితుల పరిస్థితులు దిగజారిపోయాయి. “వార్షిక ఆదాయంలో భారీ తగ్గుదల, శాశ్వత అంగవైకల్యం ఏర్పడటం వారి ప్రధాన ఆర్థిక సమస్యలయ్యాయి,” అని చండీగఢ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ జరిపిన ఒక అధ్యయనం పేర్కొంది. “దానివల్ల వాళ్ళు తమ రోజువారీ పనులకు ఇతరుల మీద ఆధారపడవలసి వస్తోంది.”
వ్యవసాయ క్షేత్రాల్లో జరిగే ప్రమాదాల బాధితులకు నష్టపరిహారాన్ని ఇచ్చే విధివిధానాలు మొదటగా రూపొందించిన కొద్ది రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. భారత పార్లమెంట్ 1983లో ప్రమాదకర యంత్రాల (రెగ్యులేషన్) చట్టాన్ని ఆమోదించింది. ఆ తర్వాతి సంవత్సరం, వ్యవసాయ క్షేత్రాల్లో జరిగిన ప్రమాదాల బాధితులకు ఆర్థిక సాయాన్ని కూడా ఏర్పాటుచేసింది. కానీ 1984లో మొదలైనప్పటినుంచీ దాని అమలు మాత్రం కుంటినడకే నడుస్తోంది. దానికి సుర్జీత్ సింగ్ ఒక సజీవ ఉదాహరణ.
పటియాలా సంస్థానపు భూస్వామ్య పెత్తందారీ అణిచివేత మీద పోరాటం జరిపిన చరిత్ర ఉన్న ఆయన స్వగ్రామం రంగియాఁలో వ్యవసాయ యంత్రాల ప్రమాదాల వల్ల అంగవైకల్యం ఏర్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ బాధితుల్లో అనేకమంది చనిపోయారు, కానీ సుర్జీత్ కాక మరో ఇద్దరు మాత్రం ఇంకా జీవించే ఉన్నారు.
73 సంవత్సరాల రైతు పాల్ సింగ్ 1982లో, ఒక నూర్పిడి యంత్రం వల్ల కుడిచేతిని మోచేతి వరకు కోల్పోయారు. నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఆ సంఘటన గుర్తుకు వస్తే చాలు, ఆయన వణికిపోతారు. “కడా (శిక్ఖులు ధరించే ముంజేతి కంకణం) ధరించి ఉన్నాను. ఖాళీగా కూర్చోలేక, పనిచేస్తూవున్న నూర్పిడి యంత్రంలో ఆయిల్ వేయడం మొదలుపెట్టాను. ఫీడర్ లోని పెద్ద సైజు బోల్టుల్లో ఒక దానికి నా కడా తగులుకుని, అతి వేగంగా నా చేతిని లాగేయడంతో, ఎముక విరిగిపోయింది. మరుక్షణం, మణికట్టులో కొంత భాగంతో సహా నా చెయ్యి తెగి నేల మీద పడిపోయింది. గుండ్రగా మందంగా ఉండే కడా కాస్తా దీర్ఘచతురస్రాకారంలోకి మారిపోయింది. అది కనీసం ఊహించడానికి కూడా లేనంత నొప్పి. దానికన్నా గడ్డిని కత్తిరించే యంత్రంలో నా చెయ్యి తెగి ఉన్నా బాగుండేదనుకుంటాను. అది దీనికన్నా కొంత మెత్తగా జరిగిపోయేది,” అన్నారాయన.
పాల్ 20-25 రోజులపాటు ఆస్పత్రిలో ఉన్నారు. అయితే, సుర్జీత్కు లాగానే ఆయనకు కూడా జరిగిన ప్రమాదాన్ని గురించి కూర్చుని వగచేంత తీరిక సమయం లేకపోయింది. “రెండు నెల్లలోనే ట్రాక్టర్ను నడపటం మొదలుపెట్టాను. ఎప్పటిలానే దున్నడం, నాట్లు వేయడం తేలికగానే అనిపించేది, కానీ చదును చేసే పని కూడా చేయాల్సివచ్చేది. తరచుగా రెండు చేతులూ ఉపయోగించి చేయవలసిన ఆ పనిని తెల్లవారుజామున నాలుగింటికి మొదలుపెడితే, 16 గంటలపాటు చేస్తూనే ఉండేవాణ్ణి.”
తన జీవితంలో పెద్ద మార్పేమీ రాలేదని అన్నారాయన. “పెద్ద మార్పేమీ లేదు. అయితే ఎప్పుడూ ఒక పిడికిలి గట్టిగా బిగుసుకుపోయినట్లూ, ఎంత ప్రయత్నించినా దాన్ని తెరవలేకపోతున్నట్లూ అనిపిస్తుంది. అంతేగానీ, కుడిచేతిని కూడా వాడేవాణ్ణి అనే సంగతే గుర్తుకు రానంతగా నేనే నా ఎడమ చేతికి శిక్షణ ఇచ్చుకున్నాను.”

Vishav Bharti

Vishav Bharti
అదే గ్రామానికి చెందిన సుమారు 70 ఏళ్ళ వయసున్న నసీబ్ కౌర్, పాల్ సింగ్లా కాక, తన ఎడమ చేతి గురించిన జ్ఞాపకాల బరువును మోస్తూ బతుకుతున్నారు. దాదాపు పదేళ్ళ క్రితం గడ్డిని కత్తిరించే యంత్రం మీద పనిచేస్తుండగా ఆవిడ ఎడమ చేయి తెగిపోయింది. “దాణాను ముక్కలుగాచేయడం రోజూ చేసే పనే. చిన్నప్పటినుంచీ చేస్తూనే ఉన్నాను. ఆ రోజు సాయంత్రం 7 కావస్తోంది. ముందు, రోలర్లలో నా బొటనవేలు ఇరుక్కుపోయింది. ఆ వెంటనే అది నా చేతిని మింగేసింది. నేను అరవటం మొదలెట్టాను. భీతిల్లిపోయిన మా కోడలు, యంత్రాన్ని ఆపలేకపోయింది. నా అరుపులు విన్న పక్కింటివాళ్ళు పరుగెత్తుకొచ్చి ఇంజన్ని ఆపి, నా చేతిని యంత్రంలోంచి బయటకు తీశారు.”
ఈ ముగ్గురిలోనూ ఈమె ఒక్కరికే రూ. 1500 వృద్ధాప్య పింఛన్ అందుతోంది తప్ప నష్టపరిహారంగానీ, అంగవైకల్య పింఛన్ గానీ అందడంలేదు. ఈ ముగ్గురిలోనూ ఒక్క పాల్ సింగ్కు మాత్రమే నెలకు రూ. 1500 చొప్పున అంగవైకల్య పింఛన్ అందుతోంది. సుర్జీత్కు అది కూడా రావటంలేదు. వృద్ధులకు దక్కే ప్రయోజనాలు అందుకోవడం ఎప్పుడూ తేలికైన విషయం కాదు. ఇక వికలాంగులైన వృద్ధులయితే, అది ప్రభుత్వాధికార యంత్రాంగం తెప్పించే పీడకలే. బాధితుల వాదనలను అధికారులు తరచుగా తప్పుడు సాకులతోనో, కారణాలేవీ చూపకుండానో తోసి పుచ్చుతుంటారు.
తల దువ్వుకుని జడ అల్లుకోవడం, వంటపని చేసుకోవటం, చకచకా పాలు పితకడం వంటి పనులను తాను అలవోకగా చేసిన రోజులను గుర్తు చేసుకుంటూ నసీబ్ ఆలోచనల్లోకి జారిపోతుంటారు. కొద్దిసేపు విరామం తర్వాత, “ఇప్పుడు నా వల్ల కాదు," అన్నారావిడ.

Vishav Bharti
ఇంతకూ ఆవిడ రోటీలను వత్తగలరా? “అవును, చేసుకోవాలి. అవి వంకరటింకరగానే ఉంటాయి గానీ, ఏం చేయను? ఏం తప్పు చేశానని నేనీ బాధలన్నీ అనుభవించాల్సి వస్తోంది?” కళ్ళలో నీరు నిండి, బుగ్గల మీదినుంచి జారుతుండటంతో, వాటిని తుడుచుకోవడానికి ఆమె తన తెల్లటి దుపట్టాను అందుకున్నారు. “ఆ ఇక్కట్ల కాలాన్ని మరచిపోవడం అంత తేలిక కాదు,” సుర్జీత్ సింగ్ భార్య కుల్వంత్ ఆవిడని ఓదార్చే ప్రయత్నం చేశారు.
ఇదంతా చూస్తోన్న సుర్జీత్ మంచం మీద నుంచి నిశ్శబ్దంగా లేచి, ఎద్దుని కట్టేసిన గుంజ వైపు నడిచి, ఆ తాడు ముడులను మొండిదైన కుడిచేత్తోనే విప్పసాగారు. అతను కోల్పోయిన చేయి ఇప్పటికీ పనిచేస్తున్నదనే అనిపిస్తోంది - నిశ్శబ్దంగా, కనిపించకుండా, ఎప్పటికీ ఓడిపోకుండా.
ఈకథనాన్ని PARI సీనియర్ ఫెలోషిప్ 2025 కింద ప్రచురించారు.
అనువాదం: శ్రీనివాస్ బందా
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/in-punjab-green-revolution-red-harvest-te

