బల్దేవ్ కౌర్ (70), తమ పొలంలో ఒకప్పుడు తమ కుటుంబం నిర్మించుకొన్న ఇంటి శిథిలాలగుండా నడక సాగించారు. ఇంకా నిలబడి ఉన్న ఆ గదుల గోడల మీద పైనుండి కింద వరకు పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడి కనిపిస్తున్నాయి.
"ఇంటి పైకప్పు మీద వాన, వడగళ్ళు విసిరికొడుతున్నప్పుడు, మేమందరం రాత్రంతా నిద్ర మేలుకునే గడిపాం. ఏం జరుగుతోందో మాకు అర్థంకాలేదు," నెరిసిన జుట్టు, కాటన్ సల్వార్ కమీజ్ వేసుకుని, దుపట్టాతో తలను కప్పుకుని ఉన్న బల్దేవ్ అన్నారు. "తెల్లవారాక, పైకప్పు నుండి నీరు కారడం మొదలవటంతో మేమంతా బైటకు పరుగులు తీశాం."
సూర్యుడు ఉదయించడంతోనే, ఇల్లు కూలడం మొదలయిందన్నారు బల్దేవ్ చిన్న కోడలు, అమన్దీప్ కౌర్ (26). "సారే పాస్సే ఘర్ హీ పాట్ గయా (మేమందరం చూస్తుండగానే ఇల్లు కూలిపోయింది)", అన్నారు బల్దేవ్ పెద్ద కొడుకు బల్జిందర్ సింగ్ (35).
ముగ్గురు పిల్లలతో సహా ఏడుమంది సభ్యులున్న బల్దేవ్ కౌర్ కుటుంబం, ఇంతకుమునుపు ఎన్నడూ ఇలాంటి విధ్వంసాన్ని చూడలేదు. 2023 మార్చ్ నెల చివరిలో కురిసిన వడగళ్ళతో కూడిన అకాల వర్షాలు, శ్రీ ముక్త్సర్ సాహిబ్ జిల్లా, గిద్దర్బాహా బ్లాక్లోని వారి స్వగ్రామం భలాయీఆణాలోని పంటపొలాలను, ఇళ్ళను నాశనం చేశాయి. నైరుతి పంజాబ్లోని ఈ ప్రదేశం దక్షిణాన రాజస్థాన్తోను, తూర్పున హర్యానాతోనూ సరిహద్దును పంచుకుంటుంది.
వర్షం, వడగళ్ళు మూడు రోజుల పాటు పడుతూనే ఉండడంతో, బల్జిందర్ దిగులుచెందారు. తమ కుటుంబానికి చెందిన 5 ఎకరాల పొలానికి జతగా మరో పది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకోవడం కోసం వారు ఒక ఆఢ్తియా (వ్యవసాయోత్పత్తుల కమీషన్ ఏజెంట్) నుండి రూ. 6.5 లక్షలు అప్పు చేశారు. ఇప్పుడు గోధుమ పంట రాకుంటే, కుటుంబ పోషణకు కష్టమవటమే కాక అప్పు తీర్చే దారి కూడా ఉండదు.
"అప్పుడే పండుతోన్న పంటను ముందుగా వడగళ్ళు దెబ్బతీశాయి. ఆ తర్వాత వానలు కురవగానే పొలమంతా రోజుల తరబడి నీళ్ళు నిలిచిపోయాయి. నీరు వెళ్ళే దారి లేకపోవటంతో, నిలిచివున్న నీటిలోనే పంట కుళ్ళిపోవడం మొదలైంది," అన్నారు బల్జిందర్. "ఇప్పుడు కూడా ఆ 15 ఎకరాలలోని పంట ఆలాగే పడి ఉంది," ఏప్రిల్ నెల సగం దాటిన సమయంలో చెప్పారు బల్జిందర్.


















