మునవ్వర్ ఖాన్, 65, పోలీసు స్టేషన్కు చేరుకున్నప్పుడు లోపలి నుండి తన కుమారుడి నిస్సహాయత నిండిన మొత్తుకోళ్ళు వినిపించాయి. దాదాపు 15 నిమిషాల తర్వాత అవి ఆగిపోయాయి. పోలీసులు తన కుమారుడిని కొట్టడం ఆపేశారని ఇజ్రాయెల్ ఖాన్ తండ్రి అయిన మునవ్వర్ ఆశించారు.
అంతకు ముందు అదే రోజు ఇజ్రాయెల్ ఒక మతపరమైన సమావేశంలో పాల్గొని, భోపాల్ నుండి అక్కడికి 200 కిలోమీటర్ల దూరాన ఉన్న గునాలోని తన ఇంటికి తిరిగి వస్తున్నాడు. గునాలో అతను నిర్మాణ స్థలాల్లో రోజువారీ కూలీగా పనిచేస్తాడు.
అతను ఆ సాయంత్రం (నవంబర్ 21, 2022) గునా చేరుకున్నాడు, కానీ ఇంటికి రాలేదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో, గోకుల్ సింగ్ కా చక్ బస్తీలోని అతని ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో, నలుగురు పోలీసు అధికారులు ఇజ్రాయెల్ ప్రయాణిస్తున్న ఆటోరిక్షాను ఆపి, అతనిని తీసుకుపోయారు.
నిజానికి, పోలీసులు అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఫోన్లో తన అత్తగారితో మాట్లాడుతున్నాడని అతని అక్క బానో (32) చెప్పారు. "అతను పోలీసు కస్టడీలో ఉన్న విషయం మాకు ఆ విధంగానే తెలిసింది."
అతడిని సమీపంలోని కుశ్మౌదా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక్కడే అతని తండ్రి మునవ్వర్, పోలీసు అధికారులు తన కొడుకును నిర్దాక్షిణ్యంగా కొడుతుంటే, అతను నొప్పితో అరవడాన్ని విన్నది.
దాదాపు 45 నిమిషాల తర్వాత, మునవ్వర్ తన కొడుకు నిస్సహాయంగా అరచిన అరుపులు ఆగిపోయింది పోలీసులు కొట్టడం ఆపడం వల్ల కాదని, వాళ్ళు కొట్టడం వల్ల అతను చనిపోవడంతో అరుపులు ఆగిపోయాయని గ్రహించారు. పోస్ట్మార్టంలో ఇజ్రాయెల్ కార్డియోరెస్పిరేటరీ వైఫల్యం, తలకు గాయం కారణంగా మరణించినట్లు తేలింది.
ఆ తర్వాత, కొంతమంది ఒక జూదగాడిని రక్షించడానికి ప్రయత్నించి పోలీసులతో ఘర్షణకు దిగారని, వాళ్ళలో ఒకడైన 30 ఏళ్ళ ముస్లిమ్ కార్మికుడిని తాము అదుపులోకి తీసుకున్నామని, పోలీసులు చెప్పినట్టుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
కానీ అతని కుటుంబం దానిని ఒప్పుకోవడం లేదు: "అతను ముస్లిమ్ అయినందు వల్లే అతన్ని తీసుకువెళ్ళారు," అని ఇజ్రాయెల్ తల్లి మున్నీ బాయి చెప్పారు.
ఇజ్రాయెల్ పోలీసు కస్టడీలో మరణించాడన్న వాస్తవంలో వివాదమేమీ లేదు. అతను ఎలా చనిపోయాడన్నదే వివాదాస్పదం.






