స్థానిక తపాలా కార్యాలయం కిటికీ తలుపులు కిర్రుమంటూ తెరచుకోగానే ఆ కిటికీలోంచి స్వయంగా తపాలా ఉద్యోగి (పోస్ట్మ్యాన్)గారే తనను సమీపిస్తోన్న మమ్మల్ని చూశారు.
రేణుకా మమ్మల్ని ఆ తపాలా కార్యాలయం లోపలికి రమ్మన్నట్టు చిరునవ్వుతో సంజ్ఞ చేశారు. కార్యాలయం ఒక గదిలో ఉంది. ఇంటి వసారాలోంచి ఆ గదిలోకి దారితీసే ఒక తలుపు ఉంది. ఆయన పనిచేసుకుంటోన్న ఆ చిన్న గదిలోకి అడుగుపెట్టగానే సిరా, కాగితాల వాసన మాకు స్వాగతం పలికింది. ఆ రోజుటి చివరి తపాలాను ఆయన కుప్పపోశారు. నవ్వుతూ మమ్మల్ని కూర్చోమని సైగచేశారు. "రండి, రండి! దయచేసి కూర్చోండి."
బయటిలా కాకుండా ఆ తపాలా కార్యాలయం, ఇంటి లోపల చల్లగా ఉంది. ఆ గదికి ఉన్న ఒకటే కిటికీలోంచి పిల్లగాలి లాలనగా వీస్తోంది. తెల్లగా సున్నంకొట్టివున్న గోడలపై చేతితయారీ పోస్టర్లు, మ్యాపులు, జాబితాలు అనేకం వేలాడుతున్నాయి. ఆ చిన్న గది చక్కగానూ, మంచి అమరికతోనూ అంత ముఖ్యమైన ప్రదేశం ఎలా ఉండాలనుకుంటామో అలాగే ఉంది. ఒక ఏటవాలు రాతబల్ల, కొన్ని అరమరలున్న ప్రాంతం గదిలో ఎక్కువభాగాన్ని ఆక్రమించినప్పటికీ, అక్కడ ఇరుగ్గా ఉన్నట్టు అనిపించడంలేదు.
64 ఏళ్ళ రేణుకప్ప తుమకూరు జిల్లాలోని దేవరాయపట్టణానికి చెందిన గ్రామీణ్ డాక్ సేవక్ (గ్రామీణ తపాలా ఉద్యోగి). ఆయన అధికార పరిధిలో ఆరు గ్రామాలున్నాయి.
దేవరాయపట్టణలోని ఈ గ్రామీణ తపాలా కార్యాలయం అధికారిక పనివేళలు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు. కానీ రేణుకా ప్రసాద్ ఒక్కరే ఉద్యోగి కావటంతో ఈయన తరచుగా ఉదయం 7 గంటలకే తన పని మొదలుపెడతారు. అది అలా సాయంత్రం 5 గంటలవరకూ కొనసాగుతుంది. "నా పనంతా పూర్తవడానికి నాలుగున్నర గంటలు చాలవు," అని ఆయన వివరించారు.








