“యే బతానా ముష్కిల్ హోగా కి కౌన్ హిందూ హై ఔర్ కౌన్ ముసల్మాన్ [హిందువు ఎవరో ముస్లిమ్ ఎవరో గుర్తించటం కష్టం].”
ఇక్కడ మొహమ్మద్ షబ్బీర్ ఖురేషీ (68) తన గురించి, తన పొరుగున ఉండే అజయ్ సైనీ (52) గురించి మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు అయోధ్యవాసులు రామ్కోట్లోని దురాహి కుఆఁ ప్రాంతంలో గత 40 సంవత్సరాలుగా ఇరుగుపొరుగున నివసిస్తోన్న స్నేహితులు.
ఎంతో సన్నిహితంగా ఉండే ఈ రెండు కుటుంబాలు, తమ రోజువారీ ఆందోళనలను పరస్పరం పంచుకుంటాయి, ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. “ఒకసారి నేను పనికోసం బయటకు వెళ్ళినప్పుడు, నా కుమార్తెకు ఒంట్లో బాగోలేదని మా ఇంటి నుండి నాకు కాల్ వచ్చింది. నేను త్వరత్వరగా ఇంటికి తిరిగి వచ్చే సమయానికే, ఖురేషీ కుటుంబం మా అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి, మందులు కూడా కొనిచ్చిందని నా భార్య చెప్పింది," అజయ్ సైనీ గుర్తుచేసుకున్నారు.
ఈ ఇద్దరూ కూర్చొని ఉన్న ఆ పెరడంతా బర్రెలు, మేకలు, ఒక అర డజను కోళ్ళతో నిండిపోయివుంది. పరుగులు పెడుతూ, ఆడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉన్న ఈ రెండు కుటుంబాలకు చెందిన పిల్లలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది.
అది 2024 జనవరి నెల. అట్టహాసంగా జరిగే ప్రారంభోత్సవం కోసం అయోధ్యలోని రామ మందిరం సిద్ధమవుతూ ఉంది. ఆ ఆలయం ఆవరణ నుంచి ఈ ఇద్దరి ఇళ్ళను విడదీస్తూ ఒక కొత్త, భారీ గా ఉన్న రెండంచెల ఇనుప కంచె వుంది.
ఎనభైల ప్రాంతంలో సైనీ యుక్తవయస్సులో ఉండగా అతని కుటుంబం ఖురేషీ ఇంటి పక్కకు మారింది. అప్పటి బాబ్రీ మసీదుగా ఉన్న ఆ ప్రాంగణంలో ఉన్న రాముడి విగ్రహాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తులకు సైనీ, రూపాయికి ఒక పూలమాల అమ్మేవాడు.
నిజానికి ఖురేషీలు మాంసం అమ్మేవారు. అయోధ్య పట్టణ శివార్లలో ఆ కుటుంబానికి ఒక మాంసం కొట్టు ఉండేది. 1922 తర్వాత జరిగిన అల్లర్లలో వారి ఇల్లు ధ్వంసం కావటంతో ఆ కుటుంబం వెల్డింగ్ వ్యాపారాన్ని చేపట్టింది.
















