ఇక్కడ బాగా వినిపించే పేరు ‘విరాట్ కోహ్లీ’. డూంగ్రా ఛోటాలో ఆ భారత క్రికెట్ దిగ్గజానికి చాలామంది అభిమానులు ఉన్నారు.
శీతాకాలపు ఉదయం 10 గంటలు దాటింది, డజనుమందికి పైగా యువజనం ఆటలో నిమగ్నమై ఉన్నారు. చూట్టూ పచ్చపచ్చని మొక్కజొన్న పొలాలు ఉన్న మైదానం మనకు క్రికెట్ మైదానంలా అనిపించదు, కానీ బాంస్వారా జిల్లాలోని ఈ గ్రామంలో ఉన్న క్రికెట్ ఔత్సాహికులకు పాపింగ్ క్రీజ్ నుంచి బౌండరీ లైన్ వరకు ప్రతి అడుగూ తెలుసు.
క్రికెట్ అభిమానులతో సంభాషించడానికి అత్యంత మేలైన మార్గం, వాళ్ళ అభిమాన ఆటగాళ్ళ గురించి అడగడం అని అందరికీ తెలుసిందే. ఇక్కడ మనం దీన్ని విరాట్ కోహ్లితో ప్రారంభించవచ్చు, కానీ ఆ తర్వాత మనం ఇతరుల పేర్లను కూడా వింటాం - రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్…
చివరగా, 18 ఏళ్ళ శివమ్ లబానా, “నాకు స్మృతి మంధానా అంటే ఇష్టం,” అన్నాడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్, భారత మహిళా టి20 జట్టు మాజీ కెప్టెన్ అయిన స్మృతి దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకరు.
కానీ ఈ మైదానంలో చర్చించేది కేవలం ఆ ఎడమచేతి బ్యాటర్ గురించి మాత్రమే కాదని మాకు త్వరలోనే తెలిసింది.
ఔత్సాహిక బౌలర్లు, బ్యాటర్ల మాటల సందడి మధ్య - అందరూ అబ్బాయిలే - ఒక అమ్మాయి మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. కేవలం తొమ్మిదేళ్ళ వయసున్న హితాక్షి రాహుల్ హడక్శీ తెల్లటి బూట్లు, బ్యాటింగ్ ప్యాడ్స్, థై గార్డ్, ఎల్బో గార్డ్లతో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా నిలబడింది.










